ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో 17 ఏళ్ల బాలుడి హత్య కేసులో లేడీ డాన్ జిక్రా, ఆమె సోదరుడిని అనుమానితులుగా గుర్తించారు. తన సోదరుడి కత్తిపోట్లకు ప్రతీకారం తీర్చుకోవాలనుకునే లేడీ డాన్ జిక్రా ఈ హత్యకు పాల్పడిందని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
తన సోదరుడిపై జరిగిన కత్తిపోట్ల దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన ఆమె సొంతంగా ముఠాను ఏర్పాటు చేసుకుంది. ఆమె ఇటీవల ఓ కేసులో జైలుకు కూడా వెళ్లిందని పోలీసు అధికారులు తెలిపారు. బాలుడి దారుణ హత్య సీలంపూర్ లో నిరసనలకు దారితీసింది. "మోదీజీ మదద్ కరో, యోగి మోడల్ చాహియే (మోదీ మాకు సహాయం చేయండి, మాకు యోగి మోడల్ కావాలి)" అని ప్రజలు బోర్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు.
జిక్రా కూడా సీలంపూర్ నివాసి. ఢిల్లీలోని మరో డాన్ హషీం బాబాకు గర్ల్ ఫ్రెండ్ గా ఆమె ఫేమస్. అయితే, మొదట జిక్రా హషింబాబా భార్య జోయా కు బౌన్సర్ గా పని చేసిందని చెబుతారు. ఆమె స్థానిక అండర్ వరల్డ్లో చాలా ఫేమస్. జిక్రాకు తుపాకులంటే చాలా ఇష్టమట. ఎప్పుడూ తనవెంట తుపాకీని తీసుకువెళ్తుందని చెబుతుంటారు. పిస్టల్తో వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతుంది. అంతేకాదు, తుపాకీతో ఆమె దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో ఫేమస్. అందుకే ఆమెకు 'గన్ వాలీ' అనే బిరుదు కూడా ఉంది. ఆమెకు సొంతంగా ఒక గ్యాంగ్ కూడా ఉంది.
ఆయుధ చట్టం కింద జైలుకు వెళ్లిన ఆమె.. ఈ బాలుడి హత్యకు 15 రోజుల ముందు జైలు నుంచి విడుదలయ్యారు. ఆమె జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన సోదరుడిని కొట్టిన 'లాలా' అనే వ్యక్తి కోసం వెతకడం ప్రారంభించింది. లాలా గురించి కునాల్ అనే బాలుడికి తెలుసని భావించి, కునాల్ ను లాలా గురించి అడిగింది. కానీ, అతను తనకు సహాయం చేయకపోవడంతో ఆ బాలుడిని తన గ్యాంగ్ తో కలిసి కత్తితో పొడిచి చంపేసిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో జిక్రా సోదరుడు సాహిల్ ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో జిక్రాను ప్రశ్నించారు.
శీలంపూర్ లోని జె బ్లాక్ లో గురువారం కునాల్ అనే 17 ఏళ్ల బాలుడు ఆహారం కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లగా కత్తిపోట్లకు గురయ్యాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందాడు. బాలుడికి న్యాయం చేయాలంటూ నిరసనలు వెల్లువెత్తడంతో పోలీసులు ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీలంపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామని, నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పలు బృందాలను రంగంలోకి దింపామని పోలీసులు తెలిపారు. కునాల్ అనే 17 ఏళ్ల బాలుడి హత్యపై తాను పోలీస్ కమిషనర్ తో మాట్లాడానని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. అయితే, పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరించి నిందితులను పారిపోయేందుకు వీలు కల్పించారని కునాల్ తల్లి ఆరోపించారు.
సంబంధిత కథనం