Eknath Shinde : ఎవరీ ఏక్నాథ్ షిండే? ఉద్ధవ్ ప్రభుత్వం నిలిచేనా? బీజేపీ పాత్ర ఎంత?
Eknath Shinde : శివసేన కీలక నేత ఏక్నాథ్ షిండే మాయం అవ్వడం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. ఇందులో బీజేపీ పాత్ర ఉందా? ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం నిలిచేనా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తీవ్ర ఉత్కంఠకు దారితీస్తున్నాయి.
Eknath Shinde latest news : మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ప్రమాదంలో పడింది! శివసేన కీలక నేత ఏక్నాథ్ షిండే అనూహ్యంగా మాయమవ్వడం, ఆయనతో పాటు అనేక మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారన్న వార్తలు ఇప్పుడు సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు తలనొప్పిగా మారింది. ఇంతకీ ఎవరీ ఏక్నాథ్ షిండే? ఇప్పుడు ప్రభుత్వం పరిస్థితేంటి?
ట్రెండింగ్ వార్తలు
శివసేనలో ఆయనే కీలకం..!
58ఏళ్ల ఏక్నాథ్ షిండే.. శివసేన పార్టీలోని ఓ కీలక నేత. ఆయన పూర్తి పేరు ఏక్నాథ్ సంభాజి షిండే. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో ప్రస్తుతం ఆయన పట్టణ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. 2004, 2009, 2014, 2019లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఠాణె ప్రాంతానికి చెందిన ఏక్నాథ్.. అక్కడ శివసేన ఎదుగుదలలో కీలకంగా వ్యవహరించారు. ఏక్నాథ్ షిండే తనయుడు శ్రీకాంత్ షిండే.. లోక్సభలో ఎంపీగా ఉన్నారు. ఏక్నాథ్ సోదరుడు ప్రకాష్ షిండే.. కౌన్సిలర్గా విధులు నిర్వహిస్తున్నారు.
ఏక్నాథ్కు అనేక వర్గాల నుంచి మద్దతు కూడా ఉంది. ముఖ్యంగా.. శివసేనలోనే అనేకమంది ఎమ్మెల్యేలు ఆయన వెన్నంటే నిలబడతారు. ఫలితంగా పార్టీ, ప్రభుత్వంలో పలుమార్లు కీలక పదవులు చేపట్టారు.
బీజేపీ పాత్ర?
ఏక్నాథ్ షిండే ప్రస్తుతం.. ఎవరి ఫోన్ కాల్స్ ఎత్తడం లేదు. ఎవరికీ స్పందించడం లేదు. కాగా ఆయన గుజరాత్లోని సూరత్కు వెళ్లినట్టు, ఆయన వెంట 11కుపైగా ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు సమాచారం. ఐదుగురు స్వత్రంత్ర ఎమ్మెల్యేలు కూడా సూరత్కు చేరుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
గుజరాత్ అనేది బీజేపీకి అత్యంత బలమైన ప్రాంతం. మహారాష్ట్ర నుంచి ఏక్నాథ్ డైరక్ట్గా గుజరాత్ వెళ్లడం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంలో బీజేపీ పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సమయంలోనే మహారాష్ట్రలోని బీజేపీ కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢణవీస్.. ఢిల్లీ వెళ్లినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఫలితంగా 'మాహా' రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎప్పుడు ఏ మలుపులు తిరుగుతాయి? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మాటల యుద్ధం..
తాజా పరిణామాలతో శివసేన బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడింది శివసేన. కాగా.. తాము ఏక్నాథ్తో మాట్లాడినట్టు, పరిస్థితులను చక్కదిద్దుతున్నట్టు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. మహా వికాస్ అఘాడీకి అసెంబ్లీలో బలం లేదని, వెంటనే తప్పుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
కాగా.. మహారాష్ట్రలో బీజేపీ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు. మరి ఇది సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల విజయంపైనా? లేక తాజా పరిణామాల వల్లేనా? అన్నది స్పష్టత లేదు.
ప్రభుత్వానికి మహా కష్టాలు..
Maha Vikas Aghadi news : 288 స్థానాలకు 2019లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మెజారిటీ ఫిగర్ 145. అధికారపక్షంగా బరిలో దిగిన బీజేపీకి 105 సీట్లు దక్కాయి. శివసేనకు 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్కు 44 స్థానాలు వచ్చాయి. అంటే.. ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ దక్కలేదు.
అక్కడే అసలు కథ మొదలైంది. సీఎం పదవిని పంచుకుంటేనే మద్దతిస్తామని బీజేపీకి తేల్చిచెప్పింది శివసేన. అందుకు బీజేపీ అంగీకరించలేదు. ఫలితంగా.. బీజేపీ- శివసేన మధ్య దశాబ్దాల మైత్రి తెగిపోయింది.
ఆ తర్వాత.. ఎన్సీపీ, కాంగ్రెస్తో కలిసి మహా వికాస్ అఘాడీని ఏర్పాటు చేసింది శివసేన. ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
సంబంధిత కథనం
టాపిక్