Bengaluru murder: ‘తరచూ నా తల్లిదండ్రులను అవమానించేది’- భార్యను చంపి సూట్ కేస్ లో కుక్కిన బెంగళూరు టెక్కీ వివరణ-what led bengaluru techie to kill his wife and stuff her body inside a suitcase ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bengaluru Murder: ‘తరచూ నా తల్లిదండ్రులను అవమానించేది’- భార్యను చంపి సూట్ కేస్ లో కుక్కిన బెంగళూరు టెక్కీ వివరణ

Bengaluru murder: ‘తరచూ నా తల్లిదండ్రులను అవమానించేది’- భార్యను చంపి సూట్ కేస్ లో కుక్కిన బెంగళూరు టెక్కీ వివరణ

Sudarshan V HT Telugu

Bengaluru techie murder: ఇటీవల సంచలనం సృష్టించిన హత్య కేసు వివరాలను బెంగళూరు పోలీసులు శనివారం వెల్లడించారు. తన భార్యను కత్తితో పొడిచి హత్య చేసి, మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కి అక్కడి నుంచి పరారైన టెక్కీ రాకేశ్.. తను ఈ దారుణానికి పాల్పడిన కారణాలను పోలీసులకు వివరించాడు.

తరచూ నా తల్లిదండ్రులను అవమానించేది..

Bengaluru techie murder: ఓ టెక్కీ తన భార్యను హత్య చేసి సూట్కేసులో కుక్కిన హత్య కేసులో బెంగళూరు పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఓ ప్రైవేట్ కంపెనీలో సీనియర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న రాకేష్ ఖేడేకర్ తన భార్య గౌరీ సాంబేకర్ ను హులిమావు సమీపంలోని దొడ్డకమ్మనహళ్లి నివాసంలో కత్తితో పొడిచి చంపి, ఆమె మృతదేహాన్ని సూట్ కేస్ లో కుక్కి, నగరం విడిచి పారిపోయాడు.

ముంబై నుంచి వచ్చి..

పోలీసులకు రాకేశ్ ఇచ్చిన వాంగ్మూలంలోని వివరాల ప్రకారం.. ఈ జంట ఇటీవలే ముంబై నుంచి బెంగళూరుకు వచ్చారు. వీరిది ప్రేమ వివాహం. స్కూల్ రోజుల నుంచి వీరి మధ్య పరిచయం ఉంది. రాకేశ్ బెంగళూరులోని ఒక కంపెనీలో సీనియర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా పనిచేస్తుండగా, ఆయన భార్య గౌరి ఉద్యోగ వేటలో ఉంది. హత్య జరిగిన రోజు సాయంత్రం ఆ జంట ఉల్లాసంగా గడిపారు. సమీపంలోని ఖాళీ ప్రదేశానికి వెళ్లి రాత్రి 7.30 గంటల సమయంలో స్నాక్స్, మద్యం తీసుకుని ఇంటికి చేరుకున్నారు. పని అయిపోయాక మద్యం సేవించడం రాకేష్ కు దినచర్యగా మారింది. గౌరీ తరచూ భోజనం వడ్డించడం మరియు సంగీతం ప్లే చేయడం ద్వారా అతనికి కంపెనీ ఇచ్చేది.

పాటలు ప్లే చేస్తూ..

ఆ రాత్రి రాకేశ్ మద్యం సేవిస్తుండగా, తమకు ఇష్టమైన పాటలను, ఒకరి తరువాత ఒకరు ప్లే చేయాలని వారు నిర్ణయించుకున్నారు. డ్రింక్ తాగుతూ రాకేష్ కొన్ని పాటలు ప్లే చేస్తుండా, ఆ సమయంలో, గౌరీ వంటగదిలో వంట చేశారు. తన వంతు వచ్చినప్పుడు, ఆమె ఒక మరాఠీ పాటను ప్లే చేసింది. ఆ మరాఠీ పాట తండ్రీ కొడుకుల సంబంధాలను ఎగతాళి చేసేలా ఉంది. ఆ పాటలోని లిరిక్స్ పాడుతూ, రాకేశ్ ను అతడి భార్య గౌరి హేళన చేసింది. అతని ముఖంపైకి గాలి ఊదుతూ, మరింత రెచ్చగొట్టింది.

తల్లిదండ్రులను అవమానించిందని..

అయితే, అప్పటికే పలుమార్లు తన తల్లిదండ్రులు, సోదరి గురించి గౌరీ పలుమార్లు అవమానకరంగా మాట్లాడింది. ఇప్పుడు మళ్లీ తన తండ్రిని హేళన చేయడంతో కోపోద్రిక్తుడైన రాకేష్ ఆమెను గట్టిగా తోసేశాడు. దాంతో, ఆమె కిచెన్ ఏరియా దగ్గర కింద పడిపోయింది. అందుకు ప్రతీకారంగా ఆమె అతనిపై కిచెన్ లోని కత్తితో దాడి చేయడానికిి ప్రయత్నించింది. దాంతో, అదుపులేని కోపంతో రాకేష్ అదే కత్తిని తీసుకుని గౌరి మెడపై రెండుసార్లు, పొత్తికడుపులో ఒకసారి పొడిచాడు. అప్పుడు సమయం రాత్రి 8.45 నుంచి 9 గంటల మధ్య.

సూట్ కేస్ లో కుక్కి..

కత్తిపోట్లతో రక్తస్రావం అవుతున్న సమయంలో ఆమె పక్కన కూర్చొని ఆమె మాటలు, చేతలు తనను ఎంతగా బాధ పెట్టాయో రాకేష్ వివరించాడు. బెంగళూరులో ఉద్యోగం దొరక్కపోవడంతో విసిగిపోయి ముంబైకి తిరిగి వెళ్లాలని భావించిన గౌరీ గతంలో తన సూట్ కేసును ఖాళీ చేసి ఉంచింది. గౌరి చనిపోయిన తరువాత మృతదేహాన్ని ఆ సూట్ కేస్ లోనే కుక్కాడు. దాన్ని బాత్రూం వైపు లాగేందుకు ప్రయత్నించగా సూట్ కేస్ హ్యాండిల్ పగిలిపోయింది. దాంతో, దాన్ని అక్కడే వదిలేసి ఇంటిని శుభ్రం చేశాడు.

అర్ధరాత్రి పరారీ

అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో రాకేష్ ఇంటికి తాళం వేసి కారులో పరారయ్యాడు. దాదాపు 800 కిలోమీటర్లు ప్రయాణించి మహారాష్ట్రలోని షిర్వాల్ వరకు వెళ్లాడు. అక్కడినుంచే పోలీసులు అతడిని ఏప్రిల్ 2న అదుపులోకి తీసుకున్నారు. గౌరీ తరచూ తన తల్లిదండ్రులు, సోదరిని దూషిస్తుండడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని విచారణలో రాకేష్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. స్కూల్ డేస్ నుంచి తమ మధ్య ఉన్న సంబంధాన్ని వివరించాడు. తాను ఆమెను గాఢంగా ప్రేమించానని, కానీ, పెళ్లి తరువాత ఆమె ప్రవర్తనతో విసిగిపోయానని చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.