పాకిస్థాన్, భారత్ మధ్య రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పాకిస్థాన్ దాడులను భారత్ గట్టిగా తిప్పికొట్టింది. పాకిస్థాన్తో పోరాటం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని కూడా రంగంలోకి దింపాలని అనుకుంటోంది. రెగ్యూలర్ ఆర్మీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం చెప్పింది. టెరిటోరియల్ ఆర్మీ గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం..
టెరిటోరియల్ ఆర్మీ అనేది భారత సైన్యానికి రిజర్వ్ ఫోర్స్, ఇది భారత సైన్యానికి సేవలందించే పార్ట్-టైమ్ వాలంటీర్లతో కూడి ఉంటుంది. టెరిటోరియల్ ఆర్మీలో అధికారులు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, నాన్-కమిషన్డ్ ఆఫీసర్లు, భారత సైన్యంలో ఉన్నవారికి సమానమైన ర్యాంకులను కలిగి ఉన్న ఇతర సిబ్బంది ఉంటారు. ఈ ఆర్మీ ప్రధానంగా సాధారణ సైన్యాన్ని స్థిర విధుల నుండి ఉపశమనం కలిగించడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పౌర పరిపాలనలో సహాయం చేయడానికి ఉపయోగించబడుతుంది.
టెరిటోరియల్ ఆర్మీ చరిత్ర 1857 ఇండియన్ సిపాయి తిరుగుబాటు నాటిదని కూడా అంటారు. ఆ సమయంలో స్వచ్ఛంద దళం ఏర్పడింది. అప్పటి నుండి టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి పునాది పడిందని చెబుతారు. అంటే మెల్లమెల్లగా టెరిటోరియల్ ఆర్మీగా రూపాంతరం చెందింది. బ్రిటిష్ కాలంలో ఆవిర్భవించిన టెరిటోరియల్ ఫోర్స్ భారత సరిహద్దుల పరిధిలో పనిచేసింది. దళాల కమాండర్-ఇన్-చీఫ్ సర్ చార్లెస్ మన్రో భారత టెరిటోరియల్ ఫోర్స్ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇది సాధారణ సైన్యానికి సహాయం చేయడానికి ఏర్పడింది. 1948లో టెరిటోరియల్ ఆర్మీ చట్టం ఆమోదించారు. మొదటి భారత గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి అక్టోబర్ 9, 1949న టెరిటోరియల్ ఆర్మీని అధికారికంగా ప్రారంభించారు.
టెరిటోరియల్ ఆర్మీ అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఇది రెగ్యులర్ ఆర్మీలో భాగం. ప్రస్తుతం దీని పాత్ర రెగ్యులర్ ఆర్మీకి స్టాటిక్ విధుల నుండి ఉపశమనం కలిగించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పౌర పరిపాలనకు సహాయం చేయడం. దేశ ప్రజలు ప్రభావితమైనప్పుడు లేదా దేశ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు అవసరమైన సేవలను నిర్వహించడం. అలాగే అవసరమైనప్పుడల్లా రెగ్యులర్ ఆర్మీతో కలిసి పని చేయాలి.
ప్రస్తుతం టెరిటోరియల్ ఆర్మీలో దాదాపు 50,000 మంది సిబ్బంది ఉన్నారు. క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు సహా అనేక మంది ప్రముఖ వ్యక్తులు కూడా టెరిటోరియల్ ఆర్మీలో సభ్యులుగా ఉన్నారు.
టెరిటోరియల్ ఆర్మీ యూనిట్లు 1962లో ఇండియా-చైనా యుద్ధం. 1965లో ఇండియా-పాకిస్థాన్ యుద్ధం, 1971లో ఇండియా-పాకిస్థాన్ యుద్ధంలో చురుకుగా పాల్గొన్నాయి. శ్రీలంకలో ఆపరేషన్ పవన్, పంజాబ్ మరియు జమ్మూ కాశ్మీర్లలో ఆపరేషన్ రక్షక్, ఈశాన్య భారతదేశంలో ఆపరేషన్ రైనో, ఆపరేషన్ బజరాంగ్లలో సైన్యం పాల్గొంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ముఖ్యంగా మహారాష్ట్రలోని లాతూర్, ఉత్తరకాశి, ఒడిశాలోని సూపర్ సైక్లోన్ సమయంలో దేశానికి సేవ చేశారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, అస్సాం, జమ్మూ కాశ్మీర్లలో 66,000 హెక్టార్ల భూమిలో సుమారు 6 కోట్ల 65 లక్షల చెట్లను నాటారు.
టాపిక్