కెనడా తన ఇమ్మిగ్రేషన్ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్న సమయంలో ప్రధానమంత్రి మార్క్ కార్నీ నేతృత్వంలోని ప్రభుత్వం తాజాగా ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. ఈ సీ-3 బిల్లు.. సంతతి అందించే పౌరసత్వంపై పరిమితిని తొలగిస్తుంది. ఈ మేరకు కొత్త బిల్లును ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మినిస్టర్ లీనా మెట్లెజ్ డయాబ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ కొత్త బిల్లును భారతీయ సమాజం సహ అనేక మంది వలసదారులు స్వాగతిస్తున్నారు.
ప్రస్తుత రూల్స్ ప్రకారం.. కెనడా వెలుపల పుట్టిన ఆ దేశ పౌరుడు.. తమ సంతతికి, సిటిజెన్షిప్ని ఇవ్వలేడు. 2009లో ప్రవేశపెట్టిన ఈ నియమం పౌరసత్వాన్ని మొదటి తరానికే పరిమితం చేసింది. తాజా ప్రతిపాదిత బిల్లు దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తోంది.
కానీ ఇలా జరగాలంటే తల్లిదండ్రులు కెనడాతో సంబంధాన్ని ధ్రువీకరించుకోవాలి. అంటే, బిడ్డ పుట్టే ముందు- లేదా దత్తత తీసుకునే ముందు తల్లిదండ్రులు కనీసం 1095 రోజులు (3ఏళ్లు) కెనడాలో భౌతికంగా జీవించి ఉండాలి.
ఐఆర్సీసీ (ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీ, సిటిజెన్షిప్ కెనడా) ప్రకారం.. “ఇప్పటివరకు ఉన్న మొదటి తరం పౌరసత్వం రూల్ అనేది కెనడా కుటుంబాలను ఇక ఏమాత్రం ప్రతిబింబించడం లేదు.”
కెనడా కొత్త ఇమ్మిగ్రేషన్ బిల్లుతో భారత సమాజంతో పాటు ఇతర వలసదారుల సమాజాలకు లబ్ధి చేకూరనుంది. అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెడుతున్న కఠిన రూల్స్ మధ్య, కెనడా ఇప్పుడు నిబంధనలను సవరిస్తుండటం ఊరటను ఇచ్చే విషయం. హెచ్-1బీ, ఎఫ్-1 వీసాలపై అమెరికాలో ఉంటున్న వారికి పుట్టిన బిడ్డలకు పౌరసత్వాన్ని రద్దు చేశారు ట్రంప్.
బిల్లును స్పష్టంగా చెప్పాలంటే.. కెనడా పౌరులు లేదా కెనడాలో పూర్వికులు ఉండి, భారత దేశంలో పుట్టిన వారికి కూడా ఇప్పుడు ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది.
“ఈ సీ-3 బిల్లు ప్రస్తుత నిబంధనల్లో లోపాలు, తప్పులను సరిచేస్తుంది. కానీ ఇమ్మిగ్రేషన్పై కెనడా ప్రజల ప్రస్తుత అభిప్రాయాల నేపథ్యంలో దీనికి కాస్త వ్యతిరేకత ఎదురవ్వొచ్చు,” అని ఇమ్మిగ్రేషన్ మినిస్టర్ అభిప్రాయపడ్డారు.
కెనడా కొత్త బిల్లుకు ఆమోదం లభించి, అది చట్టంగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
“పార్లమెంట్లోని రెండు సభల్లో ఆమోదం లభించి, రాయల్ ఆమోదం కూడా వస్తే.. ఇందులోని నిబంధనలను త్వరగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తాము,” అని ఐఆర్సీసీ తెలిపింది.
కెనడా పార్లమెంట్లో ఒక బిల్లు రెండు సభల్లో ఓటింగ్కి వెళ్లే ముందు 3 రీడింగ్స్ పాస్ అవ్వాలి. ఆ తర్వాత హౌస్లో ఓట్లు వేస్తారు. అక్కడ బిల్లు పాసైన తర్వాత రాయల్ గవర్నర్ జనరల్ ఆమోదం ఇవ్వాలి. ఆ తర్వాత అది చట్టంగా మారుతుంది.
సంబంధిత కథనం