భారత్-పాక్ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరుదేశాలు పూర్తి మరియు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించారు. ఈ విషయాన్ని భారత్, పాకిస్తాన్ లు ధ్రువీకరించాయి. డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ హ్యాండిల్ లో ఈ వార్తను ప్రకటించారు. రెండు దేశాలు ఒప్పందానికి చేరుకున్నందుకు ఇరు దేశాలను అభినందించారు.
పోరాటం లేదా యుద్ధాన్ని తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిలిపివేయడాన్ని కాల్పుల విరమణగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఇరుదేశాలు సంధి ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా చర్చలను ప్రారంభిస్తాయి. భారత్-పాక్ లు తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించినందున, మే 10, సాయంత్రం 5 గంటల నుంచి ఇరుదేశాలు క్షిపణి, డ్రోన్ దాడులను నిలిపివేస్తాయి. పౌర మౌలిక సదుపాయాలను కూడా ఇరు పక్షాలు లక్ష్యంగా చేసుకోవు.
ప్రత్యర్థి పక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరచుగా శాంతి చర్చలు లేదా చర్చలకు సమయం ఇవ్వడానికి, హింస మరింత పెరగకుండా నిరోధించడానికి మరియు కొన్ని సందర్భాల్లో మానవతా సహాయం పౌరులకు చేరడానికి ఉపయోగిస్తారు. కాల్పుల విరమణతో శాంతి చర్చలకు అవకాశం లభిస్తుంది. కాల్పుల విరమణ సమయంలో చర్చలు విఫలమైతే, రెండు దేశాల్లో ఏ దేశమైనా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడులకు పాల్పడితే మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది.
కాల్పుల విరమణ ఒప్పందంపై భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ శనివారం మాట్లాడుతూ.. ఈ రోజు మధ్యాహ్నం 15:35 గంటలకు పాక్ డీజీఎంవో భారత డీజీఎంవోకు ఫోన్ చేశారు. భారత కాలమానం ప్రకారం 1700 గంటల నుంచి భూమిపై, గగనతలం, సముద్రంలో కాల్పులు, సైనిక చర్యను నిలిపివేయాలని ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. ఈ అవగాహనకు బలం చేకూర్చేలా ఇరువైపులా సూచనలు చేశారు’’ అని తెలిపారు.
మే 12న మధ్యాహ్నం 12 గంటలకు మళ్లీ ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతాయని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సోషల్ మీడియాలో ప్రకటించారు. తక్షణమే కాల్పుల విరమణకు భారత్, పాకిస్థాన్ అంగీకరించాయని పేర్కొన్నారు. తమ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత విషయంలో రాజీపడకుండా ఈ ప్రాంతంలో శాంతి భద్రతల కోసం పాకిస్థాన్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు.
గత 48 గంటల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, తాను భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, భారత విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్, పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసిమ్ మునీర్, భారత జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్, పాక్ ఎన్ఎస్ఏ అసిమ్ మాలిక్ సహా సీనియర్ భారత, పాకిస్తాన్ అధికారులతో చర్చలు జరిపామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు.
తక్షణ కాల్పుల విరమణకు భారత్, పాక్ ప్రభుత్వాలు అంగీకరించాయని, తటస్థ ప్రదేశంలో విస్తృత అంశాలపై చర్చలు జరపడానికి ఇరుదేశాలు అంగీకరించాయని మార్కొ రూబియో వెల్లడించారు. శాంతి మార్గాన్ని ఎంచుకోవడంలో ప్రధాని మోదీ, షరీఫ్ విజ్ఞత, వివేకం, రాజనీతిజ్ఞతను అభినందిస్తున్నామని చెప్పారు. ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మృతి చెందగా, ఈ దాడికి తామే బాధ్యులమని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ ఎఫ్ ) ప్రకటించింది.
సంబంధిత కథనం
టాపిక్