Harsh Goenka Comments on Elon Musk: “ఎలాన్ మస్క్ను తక్కువ అంచనా వేయొద్దు.. ఏదో గేమ్ ప్లాన్ ఉంటుంది”
Harsh Goenka Comments on Elon Musk: ఎలాన్ మస్క్ను తక్కువ అంచనా వేయకూడదని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గొయెంకా అన్నారు. ట్విట్టర్ను హస్తగతం చేసుకున్నాక తీసుకుంటున్న నిర్ణయాలపై మస్క్ విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గొయెంకా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
Harsh Goenka Comments on Elon Musk: ట్విట్టర్ను సొంతం చేసుకున్న తర్వాత ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్నారు. 50శాతం మంది ఉద్యోగుల తొలగింపు నుంచి కొత్త పాలసీల అమలు వరకు చాలా అంశాల్లో వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు. దీంతో ట్విట్టర్ను తీసుకొని మస్క్ తడబడుతున్నారని చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ను నాశనం చేస్తున్నారని కూడా చాలా మంది విమర్శలు చేస్తున్నారు. మస్క్ తీరు నచ్చని కొందరు ఉద్యోగులు రాజీనామాలు కూడా చేస్తున్నారు. అయితే భారత ప్రముఖ వ్యాపారవేత్త, RPG గ్రూప్ చైర్మన్ హర్ష గొయెంకా.. మస్క్ గురించి స్పందించారు. మస్క్ తెలివిని తక్కువ అంచనా వేస్తున్నారంటూ అభిప్రాయపడ్డారు.
ట్రెండింగ్ వార్తలు
Harsh Goenka Comments on Elon Musk: గేమ్ ప్లాన్ ఉంటుంది
“ఎలాన్ మస్క్ తెలివిని మనం తక్కువ అంచనా వేస్తున్నాం. ఆయన మ్యాడ్నెస్ కు ఓ విధానం కచ్చితంగా ఉంటుంది. అది టెస్లా అయినా, స్పేస్ ఎక్స్ అయినా, బోరింగ్ కంపెనీ అయినా.. ఆయన కాలాని కంటే ముందే ఉంటారు. ట్విట్టర్తో ఆయనకు కచ్చితంగా గేమ్ ప్లాన్ ఉంటుంది. దానిని మనం అర్థం చేసుకోలేకున్నాం. ట్విట్టర్ అంతాన్ని అంచనా వేసే ముందు.. ఆయనకు కాస్త సమయం ఇద్దాం” అని హర్ష్ గొయెంకా ట్వీట్ చేశారు.
Harsh Goenka Comments on Elon Musk: గతంలోనూ..
హర్ష్ గొయెంకా.. గతంలోనూ ఎలాన్ మస్క్ ను ప్రశంసించారు. కెరీర్ ప్రారంభంలో ఎలాంటి కష్టాలు అనుభవించారో మస్క్ వివరించిన ఓ పాత వీడియోను గొయెంకా గత వారం షేర్ చేశారు. ఆయనను జీనియస్ అంటూ పొడిగారు. 2014లో యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా మార్షల్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో జరిగిన కార్యక్రమంలో మస్క్ ఆ ప్రసంగాన్ని చేశారు. చిన్న అపార్ట్ మెంట్లో కంపెనీ ప్రారంభించానని, ప్రతీ రోజు నడిచే వెళ్లేవాడిని చాలా వివరాలు చెప్పారు. తొలినాళ్లలో ఎన్నో కష్టాలు పడిన ఎలాన్ మస్క్.. ప్రస్తుతం టెస్లా, స్పేస్ఎక్స్ తో పాటు మరిన్ని కంపెనీలను స్థాపించి ప్రపంచ కుబేరుడిగా ఉన్నారు. తాజాగా ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నారు.
44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ ఇటీవల కొనుగోలు చేశారు. ఆ తర్వాత కంపెనీ సీఈవో పరాగ్ అగర్వాల్తో పాటు ఉన్నతాధికారులను తొలగించారు. 50 శాతం మంది ఉద్యోగులను కూడా తీసేశారు. ఉద్యోగులకు అధిక పని గంటలతో పాటు చాలా నిబంధనలను తీసుకొచ్చారు. ట్విట్టర్ వెరిఫైడ్ బ్లూటిక్ కోసం నెలకు 8 డాలర్లు చెల్లించాలనే సబ్స్క్రిప్షన్ ప్లాన్ను తీసుకొచ్చారు. ఇందులో చాలా చర్యలు మస్క్ ను విమర్శల పాలు చేస్తున్నాయి.