India's G20 presidency: జీ 20 అధ్యక్ష దేశంగా భారత్ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో, అందుకు సంబంధించిన లోగో, థీమ్, వెబ్ సైట్ లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రపంచానికి భారత్ అందిస్తు్న్న సందేశాన్ని వీటిలో పొందుపర్చారు.
ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. ప్రధాని మోదీ సమర్ధ నిర్దేశికత్వంలో అంతర్జాతీయ వేదికల నాయకత్వ బాధ్యతలను భారత్ చేపడుతోందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఉమ్మడి సమస్యలకు పరిష్కారం వెదికే దిశగా భారత్ కృషి చేస్తుందని తెలిపింది.
జీ 20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తరువాత దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను భారత్ చేపట్టనుంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాల్లో దాదాపు 32 వేర్వేరు రంగాలకు సంబంధించి సుమారు 200 సమావేశాలను నిర్వహించనుంది.
జీ 20 సభ్య దేశాల జనాభా మొత్తం ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు ఉంటుంది. అలాగే, మొత్తం ప్రపంచ జీడీపీలో 85%, మొత్తం గ్లోబల్ ట్రేడ్ లో 75% ఈ దేశాలనుంచే వస్తుంది. జీ 20లో భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, యూఎస్ఏ, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. నవంబర్ 15, 16 తేదీల్లో ఇండోనేసియాలోని బాలిలో జీ 20 సదస్సు జరగనుంది.