Land In Heaven : స్వర్గంపై రియల్ ఎస్టేట్ దందా.. భూములు కొన్న జనం.. దీనికో రేట్ కూడా ఫిక్స్ చేసేశారుగా
Land In Heaven : ప్రపంచంలో జరిగే కొన్ని కొన్ని విషయాలు నవ్వు తెప్పిస్తాయి. ఎలా నమ్మేస్తారో.. ఎలా బుట్టలో పడిపోతారో తెలియదు జనాలు. తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే.. కొంతమంది స్వర్గంలో భూములు కొన్నారు. దానికోసం రేట్ కూడా ఫిక్స్ చేశారు.
హిందూ మతం ప్రకారం మన పాపపు పనుల ఆధారంగా మరణం తర్వాత స్వర్గం, నరకం అనే భావనలు ఉన్నాయి. ఈ విధంగా ప్రతి మతానికి స్వర్గం, నరకం, పునర్జన్మ గురించి స్వంత నమ్మకాలు ఉంటాయి. అలాగే మరణానంతరం విముక్తి పొందడం కూడా ఒక నమ్మకం. ఇవన్నీ జరుగుతాయో లేదో అనేది తర్వాత సంగతి. కానీ మత ఆచారాల ప్రకారం మాత్రం చాలా నమ్మకాలు ఉన్నాయి. అయితే వీటినే కొందరు క్యాష్ చేసుకుంటున్నారు.
ఇది కాకుండా మానవులు మరణానంతరం స్వర్గప్రాప్తి కోసం అనేక రకాల పూజలు చేస్తారు. మరణానికి ముందు శుభకార్యాలు చేసిన వారు స్వర్గ ప్రవేశం చేస్తారని నమ్మకం. దీనికోసం పాపపుణ్యాలు చేసినా స్వర్గానికి వెళ్లాలని కోరుకుంటారు.
కానీ మీరు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్లాలనుకుంటే ఒక్క వ్యక్తిని కలవవచ్చు. అవును మిమ్మల్ని నేరుగా స్వర్గానికే పంపుతాడు. అలా అని ఫ్రీగా పంపేస్తాడు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అలాగే స్వర్గంలో మీకోసం స్థలం రిజర్వ్ చేస్తాడు. దానికి మీరు ఒక రేట్ ఇవ్వాలి. ఈ వార్త వైరల్గా మారి జనాలు షాక్కు గురవుతున్నారు.
స్పానిష్కు చెందిన ఓ చర్చి స్వర్గంలో స్థలం వాగ్దానం చేస్తూ ఒప్పందాల ద్వారా మిలియన్ల డాలర్లను సేకరించిందని అనేక వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందుకోసం ఆ చర్చి పాస్టర్ ఓ బ్రోచర్ కూడా విడుదల చేశారు. ఇందులో వెనక నుంచి బంగారు కిరణాలతో మేఘంలో నిర్మించిన ఇంటి ఫొటోను పెట్టారు.
స్వర్గంలో ప్రతి చదరపు మీటరు స్థలం ధర సుమారు 100 డాలర్లుగా నిర్ణయించారు. ఆశావహులు అమెరికన్ ఎక్స్ప్రెస్, యాపిల్ పేతోపాటుగా వివిధ రకాలుగా ఆన్లైన్లో డబ్బులు చెల్లించవచ్చు. చర్చి పాస్టర్ 2017లో దేవుడితో మాట్లాడి స్వర్గంలో ఉన్న స్థలాన్ని అమ్మకానికి పెట్టారని చెప్పుకొస్తున్నారు.
అయితే స్వర్గంలో స్థానం ఎక్కడ ఇవ్వబడుతుందో మాత్రం చెప్పడం లేదు. ఈ ప్రకటన ఇచ్చిన చర్చి ఇప్పుడు కోట్లాది రూపాయలు కాజేసినట్లు తెలుస్తోంది. దానికి తోడు స్వర్గంలో చోటు కొనేందుకు కొంతమంది కూడా ఇంట్రస్ట్ చూపించడం ముక్కున వేలేసుకునేలా ఉంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. పాస్టర్ ముందుగా స్వర్గానికి వెళితే అక్కడి నుంచి వీడియో కాల్ ద్వారా స్పేస్ కన్ఫర్మ్ చేస్తానని, ఆ తర్వాతే నేను స్థలం కొంటానని జనాలు కామెంట్స్ చేస్తున్నారు.ఇలా ప్రజలను నమ్మి మోసం చేసే వ్యక్తిని దేవుడు క్షమించడు. ఇతరులకు స్వర్గంలో చోటు కల్పించి తానే నరకానికి వెళతాడని మరొకరు కామెంట్ చేశారు. మెుత్తానికి స్వరంలోనూ రియల్ ఎస్టేట్ దందా చేస్తున్న వార్త మాత్రం వైరల్ అవుతుంది.