Allahabad HC: మహిళ వక్షోజాలను పట్టుకోవడం లేదా పైజామాను కిందకు లాగడం అత్యాచారం లేదా అత్యాచారయత్నం గా భావించలేమని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించిన కొన్ని వారాల తరువాత.. అదే కోర్టులోని మరో న్యాయమూర్తి అత్యాచార నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు. అత్యాచారానికి బాధ్యత ఆ బాధిత యువతిదేనని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, ఒక యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్న ఆ యువతి తన ముగ్గురు మహిళా స్నేహితులతో కలిసి ఢిల్లీలోని ఓ బార్ కు వెళ్లింది. అక్కడ వారు అతిగా మద్యం సేవించారు. తెల్లవారు జామున 3 గంటల వరకు వారు అక్కడే ఉన్నారు. మద్యం ఎక్కువగా తీసుకోవడంతో ఆమె పూర్తిగా మత్తులోకి జారుకుని, ఒంటరిగా తిరిగి వెళ్లలేని పరిస్థితికి చేరుకుంది. అదే సమయంలో, ఆమె బార్ లో ఉండగా నిందితుడు ఆమెను తనతో పాటు తన ఇంటికి రావాలని బలవంతం చేస్తూ వచ్చాడు. మద్యం మత్తులో ఉండటం, ఒంటరిగా తిరిగి వెళ్లలేని స్థితిలో ఉండడం వంటి కారణాల వల్ల ఆమె అతనితో వెళ్లి అతడి ఇంట్లో విశ్రాంతి తీసుకోవడానికి అంగీకరించింది.
కార్లో ఇంటికి వెళ్తున్న సమయంలో కూడా నిందితుడు తనను అనుచితంగా తాకాడని, నోయిడాలోని తన సొంత ఇంటికి కాకుండా, గుర్గావ్ లోని తన బంధువుల ఫ్లాట్ కు తీసుకెళ్లాడని ఆమె తెలిపింది. అక్కడ నిందితుడు మద్యం మత్తులో ఉన్న తనపై రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బాధితురాలి ఆరోపణ నిజమేనని భావించినా, అది ఆమె స్వయంకృతాపరాధమేనని జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ వ్యాఖ్యానించారు. ఎంఏ చదువుతున్న బాధిత యువతికి తన చర్యల పర్యవసానాలు తెలియదా? అని ప్రశ్నించారు. ఆమె స్వయంగా ఇబ్బందులను ఆహ్వానించిందని అన్నారు. కాగా, ఆ యువతిపై జరిపిన వైద్య పరీక్షల్లో ఆమె ప్రైవేట్ పార్ట్ లోని హైమెన్ చిరిగిపోయినట్లు తేలింది. కానీ, లైంగిక దాడి జరిగినట్లుగా డాక్టర్ నిర్ధారించలేదు.
బాధిత యువతి ఆరోపణలు నిజమని భావించినా అది అత్యాచారంగా భావించలేమని, ఇద్దరి మధ్య అంగీకారంతో లైంగిక చర్య జరిగి ఉండవచ్చని నిందితుడి తరఫు న్యాయవాది వాదించారు. తన క్లయింట్ 2024 డిసెంబర్ నుంచి జైలులో ఉన్నాడని, ఆయనకు ఎలాంటి నేర చరిత్ర లేదని, బెయిల్ లభిస్తే బెయిల్ ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయరని, కేసు సత్వర పరిష్కారానికి సహకరిస్తారని న్యాయవాది కోర్టులో వాదించారు.
ఈ కేసులో అన్ని వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ సింగ్ నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు. కేసు వాస్తవాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, నేరం స్వభావం, సాక్ష్యాధారాలు, నిందితుల ప్రమేయం, పక్షాల తరఫు న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకుని పిటిషనర్ కు బెయిల్ మంజూరు చేయడం న్యాయమేనని తాను భావిస్తున్నానన్నారు.
సంబంధిత కథనం