Uttar Pradesh crime news: పుట్టబోయే బిడ్డ ఆడో, మగో తెలుసుకోవడం కోసం నిండు గర్భిణి పొట్ట కోసిన కిరాతకుడు-uttar pradesh man gets life term for cutting open pregnant wifes stomach ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Uttar Pradesh Crime News: పుట్టబోయే బిడ్డ ఆడో, మగో తెలుసుకోవడం కోసం నిండు గర్భిణి పొట్ట కోసిన కిరాతకుడు

Uttar Pradesh crime news: పుట్టబోయే బిడ్డ ఆడో, మగో తెలుసుకోవడం కోసం నిండు గర్భిణి పొట్ట కోసిన కిరాతకుడు

HT Telugu Desk HT Telugu

Uttar Pradesh crime news: పుట్టబోయే బిడ్డ ఆడో, మగో తెలుసుకోవడం నిండు గర్భిణి అయిన తన భార్య పొట్టను కొడవలితో కోసాడో కిరాతకుడు. ఆ దుర్మార్గుడికి కోర్టు యావజ్జీవ జైలు శిక్ష విధించింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.

ఉత్తర ప్రదేశ్ క్రైమ్ న్యూస్ ((Getty Images/iStockphoto))

Uttar Pradesh crime news: పుట్టబోయే బిడ్డ ఆడో, మగో తెలుసుకోవడానికి గర్భవతి అయిన భార్య కడుపును కోసిన ఘటన 2020 సెప్టెంబర్ లో ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఆ రాక్షస భర్తకు కోర్టు జీవిత ఖైదు విధించింది. 2020 సెప్టెంబర్ లో యూపీలోని బదౌన్ సివిల్ లైన్స్ కు చెందిన పన్నా లాల్ అనే వ్యక్తి నిండు గర్భవతి అయిన తన భార్య అనితపై కొడవలితో దాడి చేశాడు. భయంకరమైన ఆ దాడిలో అనిత అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. కానీ ఆమె కడుపులోని మగబిడ్డ మరణించాడు.

మగ బిడ్డ కోసం..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని బదౌన్ సివిల్ లైన్స్ కు చెందిన పన్నా లాల్, అనిత దంపతులకు 22 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. అనిత మగబిడ్డకు జన్మనివ్వాలని కోరుతూ పన్నాలాల్ తరచూ అనితపై చేయి చేసుకునేవాడు. ఈ విషయంలో వారిద్దరి మధ్య తరచూ గొడవ జరుగుతుండేది. పన్నాలాల్ కు కొడుకు కావాలని కోరిక ఉందని తెలుసుకున్న అనిత కుటుంబం ఈ విషయంపై గొడవ పడొద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. ఇదే సమయంలో అనిత మరోసారి గర్భం దాల్చింది. ఈ సారి మగ బిడ్డకు జన్మనివ్వకపోతే, విడాకులు ఇచ్చి మరో యువతిని పెళ్లి చేసుకుంటానని పన్నాలాల్ అనితను బెదిరించేవాడు. ఒకరోజు మరోసారి వారిద్దరి మధ్య పుట్టబోయే బిడ్డ ఆడా? మగా? అన్న విషయంలో గొడవ జరిగింది.

కొడవలితో కడుపు చీల్చి..

ఈ గొడవలో పన్నా లాల్ తీవ్రమైన ఆగ్రహంతో ఎనిమిది నెలల గర్భవతి అయిన అనితపై కొడవలితో దాడి చేశాడు. ఆమె కడుపు చీల్చి పుట్టబోయే బిడ్డ లింగాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. నిండు గర్భిణి అయిన తన భార్య అనిత పొట్టను కొడవలితో చీల్చాడు. తీవ్ర రక్తస్రావంతో, ప్రేవులు బయటకు వచ్చి వేలాడుతుండగా, ప్రాణ భయంతో, గట్టిగా అరుస్తూ అనిత వీధిలోకి పరుగులు తీసింది. స్థానికులతో పాటు సమీపంలోని దుకాణంలో పనిచేసే అనిత తమ్ముడు ఆమెను కాపాడి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పన్నాలాల్ తప్పించుకు పారిపోయాడు. ఆసుపత్రిలో వైద్యులు అనితను కాపాడగలిగారు కానీ, ఆమె కడుపులోని మగ బిడ్డను ప్రాణాలతో రక్షించలేకపోయారు.

యావజ్జీవ శిక్ష

ఈ ఘటనపై అనిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో, పన్నాలాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు విచారణ సందర్భంగా తనపై జరిగిన దారుణాన్ని అనిత కోర్టుకు వివరించింది. అయితే, తాను అనితపై దాడి చేయలేదని, ఆమే స్వయంగా తనను తాను గాయపర్చుకుందని పన్నాలాల్ కోర్టులో వాదించాడు. ఆమె సోదరులతో తనకు ఆస్తి తగాదాలు ఉన్నాయని, ఆ కోపంలో ఆమె తనను తాను గాయపర్చుకుని, తనపై ఫిర్యాదు చేసిందని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. విచారణ అనంతరం యూపీ కోర్టు పన్నాలాల్ కు యావజ్జీవ జైలు శిక్ష విధించింది.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.