Nashville school shooting : గన్ కల్చర్తో ఉక్కరిబిక్కిరి అవుతున్న అమెరికాలో మరోమారు కాల్పుల మోత మోగింది. టెనస్సి రాజధాని నాష్విల్లేలోని ఓ స్కూల్లో మాజీ విద్యార్థి మారణహోమం సృష్టించాడు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇది పక్కా ప్రణాళికతో చేసిన దాడి అని పోలీసులు వెల్లడించారు.
28ఏళ్ల ఆడ్రి హేల్ అనే వ్యక్తి.. రెండు అసాల్ట్ రైఫిల్స్, ఒక హ్యాండ్గన్తో.. కోవెనంట్ అనే క్రీస్టియన్ అకాడమీ స్కూల్లోకి చెచ్చుకెళ్లాడు. సైడ్ ఎంట్రెన్స్పై భారీగా కాల్పులు జరిపి లోపలికి వెళ్లాడు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 10 గంటలకు ఈ ఘటన జరిగింది.
US school shooting : కాల్పుల మోతతో అప్పటికే స్కూల్లో గందరగోళం నెలకొంది. అనంతరం బిల్డింగ్లో ఫైరింగ్కు పాల్పడ్డాడు హేల్. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురిలో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు పాఠశాల సిబ్బంది ఉన్నారు. మరణించిన చిన్నారుల్లో ఒకరి వయస్సు 8ఏళ్లు, మరో ఇద్దరి వయస్సులు 9ఏళ్లు. షూటింగ్లో ప్రాణాలు కోల్పోయిన పాఠశాల సిబ్బంది వయస్సు 60-61 మధ్యలో ఉంటుంది. వీరిలో ఒకరు స్కూల్ హెడ్ అయిన కాథెరిన్ కూన్స్.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు 15 నిమిషాల్లోనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే హేల్ను కాల్చి చంపేశారు. అనంతరం అతడి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. స్కూల్ మ్యాప్తో పాటు ఓ మేనిఫెస్టోనూ కూడా తీసుకున్నారు. మ్యాప్లో స్కూల్కు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. పోలీసులను ఎదుర్కొనేందుకు హేల్ పూర్తిగా సన్నద్ధమయ్యాడు. ఫలితంగా.. ఇది పక్కా ప్రణాళికతో జరిపిన దాడి అని పోలీసులు నిర్ధరించారు. వివిధ ప్రాంతాల్లో కాల్పులు జరిపేందుకు హేల్ ప్రణాళికలు రచించినట్టు, స్కూల్పై దాడి అందులో భాగం అని.. ఆ మేనిఫెస్టోను చూస్తే పోలీసులకు అర్థమైంది.
US school shooting death toll : హేల్ లింగ్పై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. అధికారులు హేల్ను 'ఆమె' అని సంబోధించారు. కాగా.. హేల్ లింక్డిన్ ప్రొఫైల్లో తన ఐడెంటిటీని పురుషుడిగానే చెప్పాడు.
స్కూల్పై దాడికి వెనకున్న కారణాలపై దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. గతంలో హేల్ ఆ స్కూల్కు వెళ్లడానికి ఇష్టపడలేదని తెలిసినట్టు వివరించారు. అసలు కారణం ఇంకా తెలియలేదని, దర్యాప్తులో వెలుగులోకి వస్తుందని స్పష్టం చేశారు.
US school shooting today : స్కూల్లోని మిగిలిన విద్యార్థులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు.
నాష్విల్లే కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన తనకు బాధ కలిగించిందని అన్నారు.
Nashville school shooting suspect : "ఇది చాలా బాధాకరమైన విషయం. గన్ కల్చర్ మన దేశాన్ని నాశనం చేస్తోంది. ఆయుధాల వినియోగంపై నిషేధం విధించాలని కాంగ్రెస్ను నేను కోరుతున్నాను," అని బైడెన్ తెలిపారు.
అమెరికాలో స్కూళ్లపై కాల్పుల ఘటనలు సర్వసాధారమైన విషయంగా మారింది. ఎవరో కోపానికి పసి పిల్లలు బలైపోతున్నారు. మొత్తం మీద అమెరికావ్యాప్తంగా గన్ కల్చర్ ఆందోళనకు గురిచేస్తోంది. కాల్పుల్లో కనీసం నలుగురు అంతకన్నా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు.. అమెరికాలో ఈ ఏడాదిలో ఇప్పటికే 129 వెలుగులోకి వచ్చాయి.
సంబంధిత కథనం