UPSC chairman resigns: యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా; ట్రైనీ ఐఏఎస్ పూజ ఖేద్కర్ ఉదంతమే కారణమా?-upsc chairman manoj soni resigns five years before term ends ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Upsc Chairman Resigns: యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా; ట్రైనీ ఐఏఎస్ పూజ ఖేద్కర్ ఉదంతమే కారణమా?

UPSC chairman resigns: యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా; ట్రైనీ ఐఏఎస్ పూజ ఖేద్కర్ ఉదంతమే కారణమా?

HT Telugu Desk HT Telugu

యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ తన పదవీ కాలం ముగియడానికి ఐదు సంవత్సరాల ముందే రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజ ఖేద్కర్ ఉదంతమే ఇందుకు కారణమని భావిస్తున్నారు.

UPSC chairman Manoj Soni resigns (Photo - X)

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ మనోజ్ సోనీ పదవీకాలం ముగియడానికి ఐదేళ్ల ముందే తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పదవి నుంచి వైదొలుగుతున్నట్లు సోనీ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. మనోజ్ సోనీ పక్షం రోజుల క్రితం చైర్మన్ పదవికి రాజీనామా చేశారని, అయితే రాజీనామాను ఇంకా ఆమోదించలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ (Puja Khedkar) అంశం తెరపైకి వచ్చిన తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చుట్టూ ఉన్న వివాదాలు, ఆరోపణలతో ఆయన రాజీనామాకు ఎలాంటి సంబంధం లేదని వారు తెలిపారు.

ఐదేళ్ల ముందే రాజీనామా

2023 మే 16న యూపీఎస్సీ చైర్మన్ గా సోనీ ప్రమాణ స్వీకారం చేాశారు. ఆయన పదవీకాలం 2029 మే 15తో ముగియనుంది. అయితే, అకస్మాత్తుగా, తన పదవీకాలం ముగియడానికి ఐదేళ్ల ముందే ఆయన రాజీనామా చేశారు. ఆ పదవిని చేపట్టేందుకు మనోజ్ సోనీ ఆసక్తి చూపలేదని, చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినప్పటికీ, తనను రిలీవ్ చేయాలని కోరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఆ సమయంలో ఆయన అభ్యర్థనను ప్రభుత్వం అంగీకరించలేదు. సోని ఇప్పుడు "సామాజిక మత కార్యకలాపాలకు" ఎక్కువ సమయం కేటాయించాలని కోరుకుంటున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

పూజా ఖేడ్కర్ ఉదంతం

యూపీఎస్సీ సభ్యుడిగా నియామకానికి ముందు సోనీ వివిధ విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ గా మూడు పర్యాయాలు పనిచేశారు. 2005 ఏప్రిల్ నుంచి 2008 ఏప్రిల్ వరకు బరోడాలోని మహారాజా సయాజీరావ్ యూనివర్సిటీ (MSU)లో వీసీ పదవిని చేపట్టారు. ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్, ఆమె కుటుంబ సభ్యులపై యూపీఎస్సీ క్రిమినల్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో సోనీ రాజీనామా చేయడం గమనార్హం. బ్యూరోక్రాట్ గా తన అధికారాలను దుర్వినియోగం చేసినందుకు ఖేడ్కర్ వెలుగులోకి వచ్చారు. ఖేడ్కర్ కేసు తెరపైకి వచ్చి, వివాదానికి దారితీసిన తరువాత, సోషల్ మీడియా యూజర్లు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారులు నకిలీ సర్టిఫికేట్లను ఉపయోగించిన సంఘటనలను ఎత్తిచూపడం ప్రారంభించారు

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.