ఉత్తర్ ప్రదేశ్ మీరట్లో దారుణ ఘటన చోటుచేసుకుంది! ఇంటికి ఫోన్ చేసి డబ్బులు అడగమని చెప్పగా, అడగకపోవడంతో ఓ 13ఏళ్ల బాలుడిని అతని స్నేహితులు దారుణంగా హత్య చేశారు. వారిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై నిందితులు కాల్పులు జరిపారు. అంతేకాదు, ఆ ఐదుగురు నిందితులు మైనర్లు కావడం గమనార్హం!
మీరట్ బిజ్నోర్లోని హుస్సేన్పూర్ కాలా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్పీ అభిషేక్ ఝా తెలిపిన వివరాల ప్రకారం.. దీపక్ కుమార్ కుమారుడు ఆయుష్ ఈ నెల 6న హుస్సేన్పూర్ కాలాలోని తన ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తన కుమారుడు ఇంటికి తిరిగి రాలేదని శివాలా కాలా పోలీస్ స్టేషన్లో మరుసటి రోజు దీపక్ ఫిర్యాదు చేశాడు. ఆ వెంటనే దీపక్ బంధువుల్లో ఒకరికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి రూ.5 లక్షల డిమాండ్ వచ్చింది.
దర్యాప్తులో భాగంగా ఇన్స్టాగ్రామ్ ఖాతాపై సాంకేతిక నిఘా సాయంతో పోలీసుల అదే గ్రామానికి చెందిన అనికేత్, అన్మోల్, ఆకాష్, నకుల్, ఉమేశ్ అనే ఐదుగురు అనుమానితులను గుర్తించారు.
రూ.2లక్షలు ఇస్తామంటూ ఆయుష్ను ప్రలోభాలకు గురిచేస్తూ నిందితులు పథకం రచించారు. అందుకు ఆయుష్ నిరాకరించడంతో, ఎక్కడ తమ కుట్రను బయటపెడతాడనే భయంతో ఆ ముఠా అతడిని గొంతు నులిమి హత్య చేసింది. ఆ తర్వాత అతని మృతదేహాన్ని ఇమ్లియా గ్రామ సమీపంలో అడవిలోని గుంతలో పూడ్చిపెట్టాలని ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న శివాలా కాలా పోలీస్ స్టేషన్, స్వాట్ నిఘా విభాగం సంయుక్త బృందం అనుమానితులను పట్టుకునేందుకు అడవిలోకి వెళ్లింది. పోలీసులు లోపలికి వెళ్లగానే నిందితులు తప్పించుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపారు. అనికేత్ జరిపిన కాల్పుల్లో ఎస్హెచ్ఓ శైలేంద్ర బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోవడంతో ఎలాంటి నష్టం జరగలేదు. ఎదురుకాల్పుల్లో అనికేత్ కాలికి గాయమై పట్టుబడ్డాడని, మిగతా నలుగురు అన్మోల్, ఆకాశ్, నకుల్, ఉమేష్లను సంఘటనా స్థలంలో అరెస్టు చేశామని అధికారులు తెలిపారు.
ఘటనా స్థలం నుంచి ఒక నాటు తుపాకీ, రెండు ఖాళీ తూటాలు, ఒక లైవ్ కాట్రిడ్జ్, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక పారను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు హత్య చేసినట్లు అంగీకరించాడు, కాల్ చేయడానికి నిరాకరించడంతో ఆయుష్ను హత్య చేసినట్లు అంగీకరించాడు.
సంబంధిత కథనం