Shradha's murder: ‘‘లివ్ ఇన్ రిలేషన్ వల్లనే ఈ నేరాలు’’
Shradha's murder: ఢిల్లీలో 20 ఏళ్ల యువతి శ్రద్ధ వాకర్ దారుణ హత్యపై ఒక వైపు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా.. మరోవైపు, పెద్ద ఎత్తున ఈ తరహా నేరాలపై విశ్లేషణలు ముంచెత్తుతున్నాయి. ఈ తరహా నేరాలకు ‘వివాహం కాకుండా కలిసి జీవించడమే’ కారణమని కేంద్ర మంత్రి ఒకరు తేల్చారు.
Shradha's murder: శ్రద్ధ వాకర్ హత్య తరహా నేరాలను అరికట్టాలంటే లివిన్ రిలేషన్ షిప్ లకు దూరంగా ఉండడమే పరిష్కారమని కేంద్ర మంత్రి కౌషల్ కిషోర్ వ్యాఖ్యానించారు. యువతులు ఈ తరహా సంబంధాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ట్రెండింగ్ వార్తలు
Shradha's murder: అదే కారణం
శ్రద్ధ వాకర్ హత్యకు ఆమె వివాహం కాకుండా కలిసి ఉండాలని నిర్ణయించుకోవడమే కారణమని కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ తేల్చారు. చదువుకున్న యువతులు అతి ఆత్మ విశ్వాసంతో అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. తల్లిదండ్రులను వదిలి, వివాహం చేసుకోకుండా, తన భాగస్వామితో వేరుగా కలిసి ఉండడం వల్ల ఈ తరహా నేరలు పెరుగుతున్నాయని విశ్లేషించారు.
Shradha's murder: అమ్మాయిల వల్లనే..
‘‘ఇలాంటి నేరాలు పెరగడానికి అమ్మాయిలు కూడా కారణం. వారు కొద్ది కాలం క్రితం పరిచయమైన వ్యక్తి కోసం చిన్నప్పటి నుంచి తమను ప్రేమగా పెంచిన తమ తల్లిదండ్రులను వదిలేసి వెళ్తున్నారు. ముఖ్యంగా చదువుకున్న అమ్మాయిలే ఇలా చేస్తున్నారు. తమ ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే, లివిన్ రిలేషన్ ఎందుకు? కోర్టుకు వెళ్లి, పెళ్లి చేసుకోవచ్చు కదా’’ అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. చదువుకున్న యువతులు అతి ఆత్మ విశ్వాసంతో, తాము సరైన నిర్ణయాలే తీసుకుంటామన్న నమ్మకంతో ఇలాంటి తప్పులు చేస్తున్నారని ఆయన వివరించారు. ‘లివిన్ రిలేషన్ మంచిది కాదు. దాని వల్ల నేరాలు పెరుగుతాయి’ అని హెచ్చరించారు.
Shradha's murder: శివసేన ఎంపీ మండిపాటు
లివిన్ రిలేషన్స్ వల్ల నేరాలు పెరుగుతాయని, అందుకు చదువుకున్న యువతులే కారణమని కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ వ్యాఖ్యానించడంపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. మహిళలపై అలాంటి క్రూరమైన వ్యాఖ్యలు చేసిన మంత్రి కిషోర్ ను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. ఈ తరహా పితృస్వామ్య చెత్తను ఇప్పటికే మహిళలుగా తాము చాలా భరిస్తున్నామని ట్వీట్ చేశారు.
Shradha's murder: పోలీసుల దర్యాప్తు
శ్రద్ధ వాకర్ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ హత్యపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడు ఆఫ్తాబ్ ను విచారిస్తున్నారు. అతడిపై నార్కొ టెస్ట్ ను ప్రయోగించాలని నిర్ణయించారు. మరోవైపు, ఈ హత్యకు కారణాలపై సోషల్ మీడియాలో విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.