Modi Trump Meeting : ముందు టారీఫ్​లు.. ఆ తర్వాత ట్రేడ్​ డీల్స్​! ట్రంప్​- మోదీ భేటీ హైలైట్స్​ ఇవే..-trump plans wonderful trade deals with pm modi soon after tariff bombshell ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Modi Trump Meeting : ముందు టారీఫ్​లు.. ఆ తర్వాత ట్రేడ్​ డీల్స్​! ట్రంప్​- మోదీ భేటీ హైలైట్స్​ ఇవే..

Modi Trump Meeting : ముందు టారీఫ్​లు.. ఆ తర్వాత ట్రేడ్​ డీల్స్​! ట్రంప్​- మోదీ భేటీ హైలైట్స్​ ఇవే..

Sharath Chitturi HT Telugu
Updated Feb 14, 2025 06:24 AM IST

Modi Trump meeting : అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో సమావేశమయ్యారు. ఇండియా సహా అనేక దేశాలపై ట్రంప్​ టారీఫ్​ పిడుగు వేసిన కొన్ని గంటల్లోనే ఈ భేటీ జరిగింది.

మోదీ- ట్రంప్​
మోదీ- ట్రంప్​ (REUTERS)

ఇండియాతో అద్భుతమైన ట్రేడ్​ డీల్స్​ కుదుర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, మిత్రపక్షం అన్న భేదం లేకుండా.. ఇండియా సహా అనేక దేశాలపై ట్రంప్​ 'రెసిప్రొకల్​ టారీఫ్​' (పరస్పర సుంకం) ప్రకటించిన రెండు గంటల్లోనే ట్రంప్​ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

ట్రంప్​- మోదీ సమావేశానికి ముందు ఇలా..

అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన మరుక్షణం నుంచి టారీఫ్​ల ప్రకటనలతో ప్రపంచ దేశాలను బెంబెలెత్తిస్తున్న డొనాల్డ్​ ట్రంప్​.. గురువారం మిత్రదేశాలకు సైతం షాక్​ ఇచ్చారు! అమెరికాతో ప్రపంచ దేశాలు చేసుకుంటున్న ఒప్పందాలు, వాటిపై ఆయా దేశాలు విధిస్తున్న సుంకాలపై అధ్యయనం చేసి, ప్రతిస్పందన టారీఫ్​లు విధించే విధంగా యూఎస్​ అఫీషియల్స్​కి అన్ని అధికారాలను ఇస్తూ ఒక మెమొరాండంపై ట్రంప్​ సంతకం చేశారు. అమెరికా ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తున్నారని, అందుకే ప్రతిస్పందిస్తున్నామని ట్రంప్​ తేల్చిచెప్పారు.

ఇందులో భాగంగానే భారత్​ని కూడా ట్రంప్​ ప్రస్తావించారు.

"ఇతర దేశాలతో పోల్చినా, అమెరికాపై టారీఫ్​లు ఎక్కువ వేస్తోంది భారత దేశమే!" అని ట్రంప్​ అన్నారు. ఫలితంగా భారత్​పైనా టారీఫ్​ పిడుగు పడింది.

"చాలా దేశాలు మా నుంచి అధిక సుంకాలు వసూలు చేస్తున్నాయి. సమన్యాయం కోసం నేను రెసిప్రొకల్​ టారీఫ్​లు వేస్తున్నాను. ఎవరూ ఫిర్యాదు చేయకూడదు," అని మెమొరాండంపై సంతకం చేస్తూ ట్రంప్​ వ్యాఖ్యానించారు.

అయితే ఈ టారీఫ్​లు ఏంటి? ఎప్పుడు అమల్లోకి వస్తాయి? అన్న విషయాలపై ట్రంప్​ వివరణ ఇవ్వలేదు. వైట్​హౌస్​ సైతం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు సంతకం చేసినప్పటికీ, టారీఫ్​ల అమలుకు కొన్ని వారాలు లేదా నెలల సమయం పడుతుందని తెలుస్తోంది.

తమ మీద ఏ దేశం.. ఎంత సుంకాలు విధిస్తోందో, తాము కూడా అంతే వసులూ చేస్తామని ట్రంప్​ చెబుతున్నారు. ఇదే నిజమైతే, భారత్​కు భారీ షాక్​ తప్పకపోవచ్చు! అమెరికా వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తున్న దేశాల్లో ఇండియా బహుశా టాప్​లో ఉంటుంది! వరల్డ్​ ట్రేడ్​ ఆర్గనైజేషన్​ ప్రకారం అమెరికా వస్తువులపై భారత్​ సగటున 17శాతం టారీఫ్​ రేట్లు విధిస్తుంది. కానీ అమెరికా ప్రస్తుతం భారత వస్తువులపై 3.3శాతం సుంకాల భారం వేస్తోంది.

అయితే, ఇదంతా.. అమెరికా పర్యటనలో ఉన్న మోదీ, ట్రంప్​ని కలవక ముందు జరిగిన విషయం. వీరిద్దరి సమావేశంతో భారత్​కు ఊరట లభిస్తుందని అందరు భావించారు.

ట్రంప్​- మోదీ సమావేశం తర్వాత ఇలా..

ఇక వైట్​హౌస్​లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం తర్వాత భారత్​తో సంబంధాలపై సానుకూలంగా స్పందించారు ట్రంప్​. రానున్న రోజుల్లో ఇండియాతో అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటామని ప్రకటించారు.

"ఇండియా మా నుంచి చాలా చాలా చమురు- గ్యాస్​ని కొనుగోలు చేస్తుంది. రానున్న కాలంలో ఇండియాతో అనేక అద్భుతమైన ట్రేడ్​ డీల్స్​ చేసుకుంటాము," అని ట్రంప్​ అన్నారు.

"ఇండో-పెసిఫిక్​ ప్రాంతంలో శాంతిని కొనసాగించేందుకు అమెరికా, ఇండియా, జపాన్​, ఆస్ట్రేలియాలు కలిసి ఉండాలని ఈ సమావేశంలో నేను మోదీ నిర్ణయించాము," అని ట్రంప్​ అన్నారు.

మరోవైపు భారత్​కి ఎఫ్​-35 ఫైటర్​ జెట్స్​ని విక్రయించనున్నట్టు ట్రంప్​ ప్రకటించారు.

"ఈ ఏడాది నుంచి భారత్​తో మిలిటరీ సేల్స్​ని భారీగా పెంచుతున్నాము. ఇండియాకు ఎఫ్​-35 స్టెల్త్​ ఫైటర్​ జెట్స్​ని విక్రయిస్తాము," అని ట్రంప్​ చెప్పుకొచ్చారు.

ఈ ఎఫ్​-35.. ప్రపంచ డిఫెన్స్​ చరిత్రలోనే అత్యాధునిక, స్టేట్​-ఆఫ్​- ఆర్ట్​ జెట్​గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే, భారత్​కు ఇంతకాలం వీటిని విక్రయించకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది! డిఫెన్స్​ విషయంలో ఇండియాకు రష్యాతో సత్ససంబంబంధాలు ఉన్నాయి. రష్యాను అమెరికా శత్రువుగా చూస్తుందన్న విషయం తెలిసిందే. భారత్​కు ఫైటర్​ జెట్స్​ విక్రయిస్తే, ఈ టెక్నాలజీని ప్రత్యర్థులు దొంగలిస్తారేమో అని అమెరికా ఇంతకాలం ఆందోళనపడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఇండియాకి ఎఫ్​-35 ఫైటర్​ జెట్స్​ని విక్రయించేందుకు సిద్ధమైంది.

భారత్- అమెరికా దేశాలు సంయుక్తంగా తమ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేసి 500 బిలియన్​ డాలర్లకు చేర్చే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయని నరేంద్ర మోదీ ప్రకటించారు. రెండు దేశాలు త్వరలోనే పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందంపై పనిచేస్తాయని తెలిపారు.

ఇండియాకు తహావుర్​ రాణా..!

26/11 ముంబై ఉగ్రదాడుల నిందితుడు తహావుర్​ రాణాని భారత్​కు పంపించనున్నట్టు ట్రంప్​ ప్రకటించారు. ప్రధానమంత్రి మోదీతో భేటీ అనంతరం జరిగిన సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.