హెచ్​1బీ వీసా లాటరీ వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు ట్రంప్​ ప్లాన్​! యూఎస్​ పౌరసత్వం విషయంలో కూడా..-trump mulls changes to us citizenship test h 1b visa programs what it means ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  హెచ్​1బీ వీసా లాటరీ వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు ట్రంప్​ ప్లాన్​! యూఎస్​ పౌరసత్వం విషయంలో కూడా..

హెచ్​1బీ వీసా లాటరీ వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు ట్రంప్​ ప్లాన్​! యూఎస్​ పౌరసత్వం విషయంలో కూడా..

Sharath Chitturi HT Telugu

అమెరికాలో ఉద్యోగం కోసం ఇచ్చే హెచ్​1బీ వీసా లాటరీ వ్యవస్థలో మార్పులు చేసేందుకు అధ్యక్షుడు ట్రంప్​ యోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు యూఎస్​ సిటిజెన్​షిప్​ టెస్ట్​లో కూడా మార్పులు చేయాలన్న ప్లాన్​లో ఉన్నట్టు తెలుస్తోంది.

అమెరికా హెచ్​1బీ వీసా వ్యవస్థలో మార్పులు? (Bloomberg)

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవిలోకి వచ్చినప్పటి నుంచి వలసదారులు, వలస వ్యవస్థపై కఠినంగా ఉంటున్న ట్రంప్​.. ఇప్పుడు హెచ్​1బీ వీసా ప్రోగ్రామ్​, యూఎస్​ పౌరసత్వం విషయంలో మార్పులు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. హెచ్​1బీ లాటరీ వ్యవస్థను పూర్తిగా మార్చడంతో పాటు యూఎస్​ సిటిజెన్​షిప్​ టెస్ట్​లో మార్పులు తీసుకురావాలని ప్లాన్​ చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో కీలక వ్యాఖ్యలు చేశారు.

అమెరికా పౌరసత్వం పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు!

యూఎస్​సీఐఎస్​ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో గురువారం న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. అమెరికా పౌరసత్వం పొందాలనుకునే వారికి అవసరమైన నేచురలైజేషన్ పరీక్షను మార్చాలని అడ్మినిస్ట్రేషన్ కోరుకుంటోందని చెప్పారు. ప్రస్తుతం, వలసదారులు 100 సివిల్​ ప్రశ్నలను అధ్యయనం చేసి, అందులో 10 ప్రశ్నలకు గాను ఆరింటికి సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

కాగా మొదటి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సమయంలో.. ఏజెన్సీ ప్రశ్నల సంఖ్యను పెంచింది. దరఖాస్తుదారులు 20 ప్రశ్నల్లో 12 ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వాలని నిబంధన పెట్టింది. త్వరలో దానిని మళ్లీ ప్రవేశపెట్టాలని ఏజెన్సీ యోచిస్తోందని ఎడ్లో చెప్పినట్లు న్యూయార్క్​ టైమ్స్​ నివేదించింది.

పౌరసత్వ పరీక్షను ఎందుకు మార్చాలనుకుంటున్నారు?

న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జోసెఫ్ ఎడ్లో.. అమెరికా పౌరసత్వం పొందడానికి చేసే పరీక్ష చాలా సులభమని, దానిని మార్చాలని అన్నారు. "ప్రస్తుతం ఉన్న పరీక్ష అంత కష్టం కాదు," అని ఎడ్లో పేర్కొన్నారు. "సమాధానాలను గుర్తుంచుకోవడం చాలా సులువు. మనం చట్ట స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించడం లేదని నేను అనుకుంటున్నాను," అని అన్నారు.

హెచ్​1బీ వీసా ప్రోగ్రామ్: ఏ మార్పులు ఉంటాయి?

డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హెచ్​1బీ వీసా లాటరీ విధానాన్ని మార్చాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీని స్థానంలో అధిక ప్రాధాన్యత కలిగిన, వేతనంతో ముడిపడిన ఎంపిక ప్రక్రియను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతిపాదిత మార్పులు అదనపు ప్రమాణాల ఆధారంగా కొన్ని దరఖాస్తుదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీని ద్వారా అత్యంత నైపుణ్యం కలిగిన, అధిక వేతనం పొందే నిపుణులకు ప్రయోజనం చేకూరుతుంది.

ప్రస్తుతం.. H1-B వీసాకు అర్హులైన దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను సమర్పిస్తారు. కంప్యూటర్ ద్వారా నడిచే లాటరీ పద్ధతిలో ర్యాండమ్​గా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ప్రతి సంవత్సరం సుమారు 85,000 హెచ్​1బీ వీసాలు జారీ చేస్తారు. ఇందులో 20,000 వీసాలు యూఎస్​ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతలు కలిగిన వ్యక్తుల కోసం కేటాయిస్తారు.

జనవరి 8 2021న, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ 85,000 వార్షిక పరిమితిని మించి రిజిస్ట్రేషన్లు వచ్చినప్పుడు హెచ్​1బీ పిటిషన్లను ఎంపిక చేసే ప్రక్రియను సవరించడానికి ఒక తుది నియమాన్ని ప్రచురించింది. అయితే అడ్మినిస్ట్రేషన్ ఏ మార్పులను ప్రతిపాదిస్తోంది? ఫోర్బ్స్ ప్రకారం.. 2021లో తుది నియమంలో, డీహెచ్​ఎస్​ కొత్త ఎంపిక ప్రక్రియను ఇలా వివరించింది:

"యూఎస్​సీఐఎస్​ స్వీకరించిన పిటిషన్లను అత్యధిక ఆక్యుపేషనల్ ఎంప్లాయ్‌మెంట్ స్టాటిస్టిక్స్ వేతన స్థాయి ఆధారంగా ర్యాంక్ చేసి ఎంపిక చేస్తుంది. ఇది ఉద్దేశించిన ఉద్యోగ ప్రాంతంలో సంబంధిత స్టాండర్డ్ ఆక్యుపేషనల్ క్లాసిఫికేషన్ కోడ్ కోసం, ఓఈఎస్​ వేతన స్థాయి IV నుంచి ప్రారంభమై, ఓఈఎస్​ వేతన స్థాయిలు III, II, I క్రమంగా అవరోహణ క్రమంలో ఎంపిక చేస్తుంది."

ఈ సంవత్సరం ప్రారంభంలో ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్రోగ్రెస్ చేసిన ఒక అధ్యయనం, హిందుస్తాన్ టైమ్స్ నివేదించినట్లుగా, ర్యాండమ్​ లాటరీని ఉపయోగించకుండా అధిక జీతాలకు ప్రాధాన్యత ఇస్తే, హెచ్​1బీ వీసాదారుల సగటు జీతం సుమారు $106,000 నుంచి $172,000 వరకు పెరగవచ్చని కనుగొంది. ఇది పెద్ద సంఖ్యలో తక్కువ వేతనం పొందే కార్మికులను నియమించుకునే ఔట్‌సోర్సింగ్ సంస్థలకు విషయాలను చాలా కష్టతరం చేస్తుంది. కానీ పరిశోధకులు, పీహెచ్​డీ హోల్డర్‌లు, సీనియర్-స్థాయి టెక్ నిపుణులకు ఇది పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని నివేదిక తెలిపింది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.