Transgenders: ట్రాన్స్జెండర్లు పోలీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు..
Transgenders: పోలీస్ పోస్టులకు ట్రాన్స్జెండర్లు దరఖాస్తు చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు నివేదించింది.
ముంబై: ట్రాన్స్జెండర్లు పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం బొంబాయి హైకోర్టుకు నివేదించింది. ఫిబ్రవరి 2023 నాటికి వారి శారీరక పరీక్షల ప్రమాణాలను నిర్దేశిస్తామని తెలిపింది. చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అభయ్ అహూజా తో కూడిన ధర్మాసనం.. ట్రాన్స్జెండర్లు రిక్రూట్మెంట్ ప్రక్రియలో పాల్గొనేందుకు వీలుగా నిబంధనలను రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం గాఢ నిద్రలో ఉండి వెనుకబడిందని నిన్న మండిపడింది. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ అంశాన్ని నివేదించింది.
ట్రెండింగ్ వార్తలు
ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్లో 'సెక్స్' కేటగిరీలో ట్రాన్స్జెండర్ల కోసం మూడో డ్రాప్ డౌన్ను చేర్చడానికి ప్రభుత్వం తన ఆన్లైన్ వెబ్సైట్ను సవరించనున్నట్లు అడ్వకేట్ జనరల్ అశుతోష్ కుంభకోని శుక్రవారం ధర్మాసనానికి తెలిపారు. ట్రాన్స్జెండర్ల కోసం పోలీస్ కానిస్టేబుల్ రెండు పోస్టులను ఖాళీగా ఉంచుతామని కోర్టుకు తెలిపారు.
‘అందరికీ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 15 వరకు పొడిగించాం. డిసెంబర్ 13 నాటికి, మూడో డ్రాప్ డౌన్ జోడిస్తాం..’ అని అశుతోష్ చెప్పారు. నిబంధనలను రూపొందించిన తర్వాత శారీరక పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఆ తర్వాత అభ్యర్థులందరికీ రాత పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఫిబ్రవరి 28, 2023 నాటికి ప్రభుత్వం నిబంధనలను రూపొందించి, ఆపై శారీరక, రాత పరీక్షలను నిర్వహించాలని బెంచ్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
నిబంధనలను రూపొందించి, శారీరక పరీక్షలు నిర్వహించే వరకు, రాష్ట్రం రాత పరీక్షలను నిర్వహించకూడదని ధర్మాసనం ఆదేశించింది. హోం శాఖ పరిధిలోని పోస్టుల కోసం దరఖాస్తు ఫారమ్లో ట్రాన్స్జెండర్ల కోసం నిబంధనను పొందుపరచాలని ఇదివరకు ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారించింది.
ఇద్దరు ట్రాన్స్జెండర్లు దాఖలు చేసిన దరఖాస్తులను మహారాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ విచారిస్తూ హోం శాఖ పరిధిలోని అన్ని రిక్రూట్మెంట్ల కోసం దరఖాస్తు ఫారమ్లో 'పురుష', 'స్త్రీ' మాత్రమే కాకుండా ట్రాన్స్జెండర్ల కోసం మూడో ఆప్షన్ పొందుపరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నవంబర్ 14న ఆదేశించింది. ట్రాన్స్జెండర్లకు శారీరక ప్రమాణాలు, పరీక్షల కోసం ప్రభుత్వం ప్రమాణాలను నిర్ణయించాలని కూడా ధర్మాసనం పేర్కొంది.
ట్రిబ్యునల్లో దరఖాస్తు చేసుకున్న ఇద్దరు ట్రాన్స్జెండర్లు తమ దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించవచ్చని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే హోం శాఖ పరిధిలోని అన్ని పోస్టుల్లో ట్రాన్స్జెండర్లు దరఖాస్తు చేసుకునేలా నిబంధనను రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ట్రిబ్యునల్ ఉత్తర్వుల్లోని ఒక భాగాన్ని హైకోర్టు నిలిపివేసింది.