Maoist Katakam Sudarshan : మవోయిస్ట్ అగ్రనేత కటకం సుదర్శన్ గుండెపోటుతో మృతి
మావోయిస్టు అగ్రనేత, పొలిట్బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ మృతి చెందారు.
Maoist Katakam Sudarshan : మావోయిస్ట్ అగ్రనేత కటకం సుదర్శన్ ఆకస్మిక మృతి చెందారు. కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడుగా కొనసాగుతున్న కటకం సుదర్శన్... మే 31న గుండెపోటుతో మృతిచెందినట్లు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఓ ప్రకటనతో తెలిపింది. కటకం సుదర్శన్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాల బస్తీవాసి. గెరిల్లా వార్ లో కటకం సుదర్శన్ దిట్ట. కటకం సుదర్శన్ మరణంపై కేంద్ర కమిటీ సంతాపాన్ని ప్రకటించింది. ఈ నెల 5 నుంచి ఆగస్ట్ 3 వరకు కటకం సుదర్శన్ సంతాప సభలు నిర్వహించాలని పిలుపునిచ్చింది.
ట్రెండింగ్ వార్తలు
జూన్ 5 నుంచి ఆగస్టు 3 వరకు సంతాప సభలు
మావోయిస్టు పొలిట్ బ్యూరో మెంబర్ కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, అలియాస్ దూలా(69) గుండెపోటుతో మృతిచెందారు. మే 31న దండకారణ్య అటవీ ప్రాంతంలో హఠాత్తుగా గుండెపోటుకు గురై మరణించినట్టు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో తెలిపారు. కటకం సుదర్శన్ దీర్ఘకాలికంగా శ్వాసకోశ వ్యాధి, డయాబెటీస్, బీపీ సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. గత బుధవారం మధ్యాహ్నం 12.20 గంటలకు గుండెపోటుకు గురై ఆయన మరణించినట్టు ప్రకటించారు. ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం, కార్యకర్తలు, దళ కమాండర్లతో పాటు వందలాది మంది సుదర్శన్ స్మారక సభ నిర్వహించినట్లు తెలుస్తోంది. అనంతరం విప్లవ సంప్రదాయాలతో కటకం సుదర్శన్ అంత్యక్రియలు నిర్వహించినట్టు అభయ్ వెల్లడించారు. జూన్ 5 నుంచి ఆగస్టు 3 వరకు దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సుదర్శన్ సంతాప సభలు నిర్వహించాలని మావోయిస్ట్ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.
శ్రీకాకుళం పోరాటాల ప్రేరణతో
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో ఓ కార్మిక కుటుంబంలో 69 ఏళ్ల క్రితం జన్మించిన కటకం సుదర్శన్ మావోయిస్ట్ భావజాలానికి ఆకర్షితులయ్యారు. శ్రీకాకుళం పోరాటాల ప్రేరణతో 1974లో మైనింగ్ డిప్లోమా విద్యార్థిగా ఉద్యమం వైపు అడుగులు వేశారు. 1975లో రాడికల్ విద్యార్థి సంఘం నిర్మాణంలో సుదర్శన్ కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత బెల్లంపల్లి పార్టీ సభ్యుడిగా ఆయన పనిచేశారు. ఈ సమయంలో సింగరేణి కార్మిక ఉద్యమం, రాడికల్ విద్యార్థి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు సుదర్శన్. 1978లో లక్షెట్టిపేట, జన్నారం ప్రాంతాల మావోయిస్టు పార్టీ ఆర్గనైజర్ గా రైతాంగ ఉద్యమాన్ని నడిపించారు. 1980లో ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా, 1987లో దండకారణ్య ఫారెస్ట్ కమిటీకి కటకం ప్రాతినిథ్యం వహించారు. 1995లో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కార్యదర్శిగా పనిచేశారు. 2001లో రెండోసారి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికైన సుదర్శన్... ఆయన సెంట్రల్ రీజనల్ బ్యూరో సెక్రటరీగా 2017 వరకు పనిచేశారు. అనారోగ్య సమస్యల కారణంగా తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు.