ఒక్క నెలలో కురవాల్సిన వర్షాలు.. కేవలం కొన్ని గంటల్లో పడితే? అమెరికా టెక్సాస్లో ఇదే జరిగింది. ఫలితంగా ఆ రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా మారింది. భారీ వర్షాలతో పాటు వరదలు ముంచ్చెత్తడంతో టెక్సాల్లో కనీసం 13మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గల్లంతయ్యారు. వీరిలో 23మంది బాలికలు కూడా ఉన్నారు.
అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం, కెర్ కౌంటీలో రాత్రిపూట కనీసం 10 ఇంచ్ (25 సెంటీమీటర్లు) వర్షం కురవడంతో గౌడలూప్ నదిలో వరద పోటెత్తింది. ఈ వరద మధ్య సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని అధికారులు చెబుతుండటంతో ఆకస్మిక వరదల కారణంగా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది! కెర్ కౌంటీ షెరీఫ్ లారీ లీథా వరదల్లో 13 మంది మరణించినట్లు ధృవీకరించారు. మృతదేహాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.
లెఫ్టినెంట్ గవర్నర్ డాన్ ప్యాట్రిక్ మాట్లాడుతూ.. కనీసం 400 మంది సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారని తెలిపారు. తొమ్మిది రెస్క్యూ బృందాలు, 14 హెలికాప్టర్లు, 12 డ్రోన్లను గాలింపు చర్యల కోసం ఉపయోగిస్తున్నామని, కొంతమందిని చెట్ల పైనుంచి రక్షించినట్లు ప్యాట్రిక్ చెప్పారు.
తమ ప్రియమైన వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న ప్రజల నుంచి సోషల్ మీడియాలో విజ్ఞప్తులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.
లెఫ్టినెంట్ గవర్నర్ డాన్ ప్యాట్రిక్ ప్రకారం, టెక్సాస్ హిల్ కంట్రీలోని క్యాంప్ మిస్టిక్ అనే వేసవి శిబిరానికి హాజరైన సుమారు 750 మంది బాలికల్లో 23 మంది గల్లంతయ్యారు. గల్లంతైన బాలికలు సహా ఆచూకీ తెలియని వారిని కనుగొనడానికి గాలింపు బృందాలను మోహరించినట్లు ఆయన తెలిపారు.
నేషనల్ వెదర్ సర్వీస్ ఆస్టిన్/శాన్ ఆంటోనియో కార్యాలయానికి చెందిన వాతావరణ శాస్త్రజ్ఞుడు బాబ్ ఫోగార్టీ ప్రకారం, హంట్లో ఒక నది గేజ్ కేవలం రెండు గంటల్లో 22 అడుగుల (6.7 మీటర్లు) మేర నీటిమట్టం పెరిగినట్లు నమోదు చేసింది. హంట్ వద్దే గౌడలూప్ నది చీలిపోతుంది.
"నీరు చాలా వేగంగా కదులుతోంది. అది మీపైకి వచ్చే వరకు ఎంత దారుణంగా ఉంటుందో మీరు గుర్తించలేరు" అని ఫోగార్టీ చెప్పారు.
నది పర్యాటకం హిల్ కంట్రీ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగం. ప్రసిద్ధ, శతాబ్దాల నాటి వేసవి శిబిరాలు దేశం నలుమూలల నుంచి పిల్లలను ఆకర్షిస్తాయి. హంట్, ఇంగ్రామ్ మధ్య, అద్దెకు అనేక నదీ తీర గృహాలు, క్యాబిన్లు ఉన్నాయి.
టెక్సాస్లో వరదలు సంభవిస్తున్న సమయంలో, మరోవైపు సెంట్రల్ న్యూజెర్సీలో తీవ్రమైన వాతావరణం నెలకొంది. అక్కడ ఉరుములతో కూడిన వర్షాల కారణంగా కనీసం ముగ్గురు మరణించారు.
ప్లెయిన్ఫీల్డ్లోని ఇద్దరు వ్యక్తులు వారి వాహనంపై చెట్టు కూలడంతో మరణించినట్లు నగరానికి సంబంధించిన ఫేస్బుక్ పోస్ట్ ద్వారా తెలిసింది.
నగరం తన ఫోర్త్ ఆఫ్ జులై పరేడ్, కచేరీ, బాణాసంచా ప్రదర్శనను రద్దు చేసింది.
సంబంధిత కథనం