Air India | చంద్రశేఖరన్​కే ఛైర్మన్​ బాధ్యతలు-tata sons chairman n chandrasekaran appointed air india chairman ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Tata Sons Chairman N Chandrasekaran Appointed Air India Chairman

Air India | చంద్రశేఖరన్​కే ఛైర్మన్​ బాధ్యతలు

HT Telugu Desk HT Telugu
Mar 14, 2022 06:43 PM IST

ఎయిర్​ఇండియా ఛైర్మన్​ బాధ్యతలు.. టాటా గ్రూప్​ను సమర్థవంతంగా నడిపిస్తున్న ఎన్​. చంద్రశేఖరన్​కే దక్కాయి. ఈ మేరకు ఆయన్ని ఛైర్మన్​గా నియమిస్తూ గత వారం ఎయిర్​ ఇండియా బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సంస్థ సోమవారం ధ్రువీకరించింది.

చంద్రశేఖరన్​
చంద్రశేఖరన్​ (ANI)

|Air India chairman | టాటా సన్స్​ ఛైర్మన్​ ఎన్​ చంద్రశేఖరన్​కు ఎయిర్​ ఇండియా బాధ్యతలు దక్కాయి. చంద్రశేఖరన్​ను ఛైర్మన్​గా నియమిస్తూ ఎయిర్​ ఇండియా బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

గత వారంలోనే ఈ ప్రక్రియ పూర్తి అయినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ విషయాన్ని సోమవారం టాటా గ్రూప్​ ధ్రువీకరించింది.

ఎయిర్​ ఇండియా ప్రవేటీకరణ నేపథ్యంలో గతేడాది అక్టోబర్​ 8న బిడ్​ను గెలుచుకుంది టాటా గ్రూప్​. మొత్తం రూ. 18వేల కోట్లు ఖర్చుపెట్టింది.

కాగా.. ఎయిర్​ ఇండియా సీఈఓపై టాటా గ్రూప్​ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వాస్తవానికి టర్కిష్​ ఎయిర్​లైన్స్​ మాజీ ఛైర్మన్​ ఇల్కర్​ ఐసిని నియమించినా.. కొన్ని వారాల తర్వాత.. బాధ్యతలు స్వీకరించకుండానే ఆయన తప్పుకున్నారు.

కారణం ఆర్​ఎస్​ఎస్​!

ఐసి తప్పుకోవడం వెనక ఓ బలమైన కారణమే ఉంది. గత నెల 14న ఆయన్ని సీఈఓగా నియమించింది టాటా సన్స్​. కాగా.. వారం రోజులకే ఆ సంస్థ నిర్ణయంపై దేశంలో వ్యతిరేకత ఎదురైంది. ముఖ్యంగా.. ఐసి నియామకానికి అంగీకరించొద్దని కేంద్రానికి ఆర్​ఎస్​ఎస్​ విజ్ఞప్తి చేసింది. టర్కీ రాజకీయాలు, అక్కడి నేతలతో ఐసికి ఉన్న సంబంధాలు దేశానికి కీడు చేస్తాయని ఆర్​ఎస్​ఎస్​ అభిప్రాయపడింది.

భారత్​లో.. ఏదైనా సంస్థకు విదేశీ సీఈఓను నియమించాలంటే.. అందుకు ప్రభుత్వ అంగీకారం తప్పనిసరిగా ఉండాలి. కాగా.. టర్కీతో ఇటీవలి కాలంలో సత్సంబంధాలు సరిగ్గా లేకపోవడంతో ఐసి నియామకంపై ప్రభుత్వం కూడా అయిష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సాధారణం కన్నా ఎక్కువగా ఐసిపై భద్రతాపరమైన తనిఖీలు చేసినట్టు సమాచారం.

ఎయిర్ ​ఇండియా సీఈఓగా ఏప్రిల్​ 1న ఐసి బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కానీ తాజా పరిణామాలతో.. తాను ఆ స్థానాన్ని తీసుకోబోనని ఐసి ప్రకటించారు. టాటా గ్రూప్​ ఛైర్మన్​ ఎన్​. చంద్రశేఖరన్​తో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు పేర్కొన్నారు.

"ఎయిర్ ​ఇండియా సీఈఓగా నన్ను ఎంపిక చేయడంపై అనవసరమైన రాజకీయ రంగులు పులుముతున్నారు. ఓ వ్యాపార నేతగా.. నేను ఎప్పుడూ నా వృత్తికే అధిక ప్రాధాన్యతనిచ్చాను. తాజా పరిణామాలతో.. ఇక నేను ఈ ఆఫర్​ను తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. అదే మంచిదని అనిపించింది," అని ఐసి వెల్లడించారు.

ఎయిర్​ ఇండియా.. ఇటీవలే అధికారికంగా టాటా గ్రూప్​లో చేరింది. ఆ తర్వాత కొన్ని రోజులకు కొత్త సీఈఓను ప్రకటించింది. అంతా సజావుగా సాగుతోంది అనుకుంటున్న తరుణంలో.. ఐసి తప్పుకున్నారు. ఫలితంగా ఇప్పుడు మళ్లీ కొత్త సీఈఓను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తాజా పరిణామాలపై ఎయిర్​ ఇండియా, టాటా సన్స్​ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో.. ఎయిర్​ ఇండియాకు సీఈఓ అంటే చాలా క్లిష్టమైన ఉద్యోగమే అని చెప్పాలి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంస్థను విజయవంతంగా నడిపించాలంటే, అందుకు తగ్గట్టు నాయకత్వం సైతం ఉండాలి. మరి ఇప్పుడు ఎయిర్ ​ఇండియా ఎవరిని సీఈఓగా ఎంపిక చేస్తుందనేది చూడాల్సి ఉంది.

ప్రస్తుతం.. ఎయిర్ ​ఇండియా చేతిలో 4,400 స్వదేశీ, 1,800 విదేశీ ల్యాండింగ్​, పార్కింగ్​ స్లాట్లు ఉన్నాయి.

1932లో టాటా ఎయిర్​లైన్స్​ పుట్టింది. 1946లో దానిని ఎయిర్​ ఇండియాగా నామకరణం చేశారు. 1953లో అది ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఇటీవలే తిరిగి టాటాలతో చేరింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం