Taliban: బహిరంగంగా నలుగురి చేతులను నరికేసిన తాలిబన్లు
Afghanistan - Taliban: బహిరంగ శిక్షలతో తాలిబన్లు మరోసారి క్రూరత్వానికి పాల్పడ్డారు. నలుగురి చేతులను బహిరంగంగా నరికేశారు.
Afghanistan - Taliban: అఫ్గానిస్థాన్లో తాలిబన్లు బహిరంగ శిక్షలను విచ్చలవిడిగా అమలు చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను అందరి ముందే కఠినంగా శిక్షిస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ లేకుండానే నిందితులుగా అనుమానించిన వారిని శిక్షిస్తున్నారని, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ అంతర్జాతీయంగా ఆరోపణలు వస్తున్నా తాలిబన్లు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా అఫ్గానిస్థాన్లో ఇలాంటి ఘటన మరోసారి జరిగింది. బహిరంగంగా నలుగురు చేతులను తాలిబన్లు నరికేశారు. స్టేడియం వేదికగా ఈ శిక్షను అమలు చేశారని సమాచారం. వివరాలివే..
ఈ ఆరోపణలతో..
Afghanistan - Taliban: దొంగతనం, బహిరంగ శృంగారం చేశారనే ఆరోపణలతో తొమ్మిది మందిని తాలిబన్లు అదుపులోకి తీసుకున్నారు. వారిని కాందహార్లోని అహ్మద్ షాహీ స్టేడియంలో బహిరంగంగా కొరడాలతో కొట్టారు. “దొంగతనం, సొడొమి (సెక్స్) ఆరోపణలపై కాందహార్లోని అహ్మద్ షాహీ స్టేడియంలో 9 మందికి శిక్ష పడిందని సుప్రీంకోర్టు ప్రకటన పేర్కొంది” అని టోలో న్యూస్ ట్వీట్ చేసింది. నిందితులను కొరడాలతో శిక్ష విధించే కార్యక్రమానికి అక్కడి స్థానిక అధికారులు, ప్రజలు హాజరయ్యారు. నిందితులను 35 నుంచి 39 సార్లు తాలిబన్లు కొరడాలతో కొట్టారని ఆ ప్రావెన్షియల్ గవర్నర్ అధికార ప్రతినిధి హజి జయీద్ వెల్లడించారు.
నలుగురి చేతులు నరికివేత!
Afghanistan - Taliban: స్టేడియంలో తాలిబన్లు నలుగురి చేతులను నరికివేశారని అఫ్గాన్ రీసెటిల్మెంట్ మంత్రిత్వ శాఖ మాజీ పాలసీ అడ్వయిజర్ షబ్నం నసిమి వెల్లడించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. కాందహార్లోని ఫుట్బాల్ స్టేడియంలో తాలిబన్లు నలుగురి చేతులను నరికారని తెలిసిందని పేర్కొన్నారు. దొంగతనం ఆరోపణలపై ప్రేక్షకులు చూస్తుండగానే నిందితులకు ఈ శిక్ష విధించారని వెల్లడించారు. ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే అని ఆమె ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు.
Afghanistan - Taliban: అంతర్జాతీయంగా ఎన్ని విమర్శలు వస్తున్నా తాలిబన్లు మాత్రం క్రూరత్వాన్ని కొనసాగిస్తున్నారు. నిందితులకు బహిరంగంగా శిక్షణలను అమలు చేస్తూనే ఉన్నారు. వీటిలో కొన్ని మాత్రమే బయటికి ప్రపంచానికి తెలుస్తున్నాయని, ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి నిపుణులు కూడా ఇప్పటి ఈ బహిరంగ క్రూరమైన శిక్షలను ఆపాలని తాలిబన్లకు సూచనలు చేశారు.
గతేడాది డిసెంబర్ 7న ఫరా ప్రావిన్స్ లో ఓ వ్యక్తిని తాలిబన్లు బహిరంగంగా ఉరితీశారు. 2021 ఆగస్టులో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చి అధికారం చేపట్టిన తర్వాత తాలిబన్లు బహిరంగ ఉరి అమలు చేయడం ఇదే తొలిసారి.