Draupadi Murmu : ఉత్సవాలకు సర్వం సిద్ధం
రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నిక లాంఛనమే అయిన నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు, గిరిజనులు వేడుకలకు సిద్ధమయ్యారు. ద్రౌపది ముర్ము ఎన్నికపై ప్రకటన వెలువడగానే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆమె స్వస్థలమైన ఒడిశాలోని రాయిరంగాపురంలో పండుగ వాతావరణం నెలకొంది.
Draupadi Murmu : ఒడిశాలోని రాయిరంగాపురంలో ప్రజలు, వ్యాపార వర్గాలు, న్యాయవాదులు, ఇతర వర్గాలన్నీ కలసికట్టుగా ఉత్సవాలకు సిద్ధమయ్యారు. వారంతా తమ ఇంటి బిడ్డ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైందన్న అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
Draupadi Murmu : స్వస్థలంలో..
దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికైందన్న వార్త వచ్చిన వెంటనే భారీ ర్యాలీ తీయాలని రాయిరంగాపురం ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఇప్పటికే విద్యార్థులు, వివిధ వర్గాలు, పార్టీల వారు సిద్ధంగా ఉన్నారు. అందులో గిరిజన నృత్యాలు, సంప్రదాయ ఆటలను ప్రదర్శించనున్నారు. ప్రదర్శన సందర్భంగా పంచడానికి 20 వేల లడ్డూలను తయారు చేశారు. ముర్ముకు శుభాకాంక్షలు తెలుపుతూ 100 బ్యానర్లను సిద్ధం చేశారు. రాష్ట్రం నుంచి ఒక నేత తొలిసారి దేశ అత్యున్నత పదవికి ఎన్నికవబోతుండడంపై ఒడిశా ప్రజలు ఆనందోత్సాహాలతో ఉన్నారు. రాయిరంగాపురంలో ద్రౌపది ముర్ము చదువుకున్న పాఠశాలలో ఆమె జీవన ప్రస్థానంలపై చిత్రపటాలను ఏర్పాటు చేశారు.
Draupadi Murmu : ఢిల్లీలో..
దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికైనట్లుగా అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే.. దేశ రాజధాని ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. అందుకు కార్యకర్తలను సమాయత్తం చేస్తోంది. అలాగే, అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే.. ఢిల్లీలోని ద్రౌపది ముర్ము నివాసానికి ప్రధాని మోదీ వెళ్లనున్నారు. అక్కడ ఆయన కాబోయే రాష్ట్రపతికి సాదరంగా శుభాకాంక్షలు తెలుపుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా, గిరిజన, ఆదివాసీలు ద్రౌపది ముర్ము సాధించనున్న విజయంపై ఆనందోత్సాహాలతో ఉన్నారు. ఉత్సవాలకు సిద్ధమవుతున్నారు.