పోక్సో కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి : సుప్రీంకోర్టు-supreme court directs centre to set up special pocso courts on priority basis know in details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పోక్సో కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి : సుప్రీంకోర్టు

పోక్సో కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి : సుప్రీంకోర్టు

Anand Sai HT Telugu

చిన్నారులపై లైంగిక నేరాల కేసుల విచారణకు ప్రత్యేక పోక్సో కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ప్రత్యేక కోర్టుల సంఖ్య లేకపోవడం వల్ల పోక్సో చట్టం కింద నమోదైన కేసుల కాలపరిమితిని పాటించడం లేదని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పీబీ వరలేలతో కూడిన ధర్మాసనం తెలిపింది.

స్పెషల్ పోక్సో కోర్టులపై సుప్రీం కోర్టు (AFP)

చాలా రాష్ట్రాలు పోక్సో కేసుల కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశాయని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, మహారాష్ట్ర, మరికొన్ని రాష్ట్రాల్లో చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అందుకే పోక్సో కోర్టుల అవసరం ఉందని తెలిపింది. పోక్సో చట్టం ప్రకారం 100కు పైగా ఎఫ్ఐఆర్‌లు ఉన్న ప్రతి జిల్లాలో ఒక కోర్టు ఉండాలని స్పష్టం చేసింది.

ప్రత్యేక కోర్టులు

పోక్సో కేసుల దర్యాప్తుతో సంబంధం ఉన్న అధికారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. పోక్సో కేసుల దర్యాప్తులో పాలుపంచుకున్న అధికారులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పింది. పోక్సో కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నట్లు కోర్టు వ్యాఖ్యానించింది. నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేయాలని చెప్పింది.

విచారణ వెంటనే చేయాలి

'కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పోక్సో కేసుల దర్యాప్తుతో సంబంధం ఉన్న అధికారుల కోసం తగిన చర్యలు తీసుకోవాలి. పోక్సో కేసులను అత్యంత ప్రాధాన్యత ఆధారంగా విచారించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలి. చట్టంలో నిర్దేశించిన గడువులోగా చార్జిషీట్లు దాఖలు చేయాలి. నిర్ణీత గడువులోగా విచారణలను పూర్తి చేయాలి.'అని సుప్రీంకోర్టు ఆదేశించింది.'

రెండు కోర్టులు

చిన్నారులపై అత్యాచార ఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పోక్సో చట్టం కింద వేధింపుల కేసులు 300కు పైగా పెండింగ్‌లో ఉన్న జిల్లాల్లో రెండు కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.