Sunita Williams : భారత్​లోని ఈ చిన్న గ్రామంతో సునితా విలియమ్స్​కి పెద్ద కనెక్షన్​..-sunita williams connection with gujarats jhulasan entire village is praying for her safe return ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sunita Williams : భారత్​లోని ఈ చిన్న గ్రామంతో సునితా విలియమ్స్​కి పెద్ద కనెక్షన్​..

Sunita Williams : భారత్​లోని ఈ చిన్న గ్రామంతో సునితా విలియమ్స్​కి పెద్ద కనెక్షన్​..

Sharath Chitturi HT Telugu

Sunita Williams Indian connection : భారత్​లోని ఒక చిన్న గ్రామంతో సునితా విలియమ్స్​కి పెద్ద కనెక్షన్​ ఉంది. ఆ గ్రామం గుజరాత్​లోని ఝులసన్​! సునితా విలియమ్స్​ ఇక్కడికి మూడుసార్లు వెళ్లారు.

సునితా విలియమ్స్​ కోసం ఝులసన్​ గ్రామంలో పూజలు.. (AP)

అంతరిక్షంలో అద్భుతాలు సృష్టించి, ఎన్నో రికార్డులు సాధించిన సునితా విలియమ్స్​ ఒక భారత సంతతి మహిళ కావడం భారతీయులకు నిజంగా గర్వకారణం. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, సునితా మాత్రం తన మూలాలను మర్చిపోలేదు. అంతరిక్షంలో 9 నెలల పాటు చిక్కుకుపోయిన ఆమె, ఇంకొన్ని గంటల్లో భూమి మీదకు తిరిగి వస్తున్న నేపథ్యంలో భారత్​లోని ఒక చిన్న గ్రామంతో సునితా విలియమ్స్​కి ఉన్న పెద్ద కనెక్షన్​ గురించి ఇక్కడ తెలుసుకోండి..

మూలాలను మర్చిపోని సునితా విలియమ్స్​..

1965 సెప్టెంబర్​ 19న అమెరికా ఓహాయోలోని యూక్లిడ్​లో జన్మించారు సునితా విలియమ్స్​. ఆమె తండ్రి పేరు దీపక్​ పాండ్య. ఆయన గుజరాత్​లో ఒక న్యూరోసైంటిస్ట్​. 1957లో అమెరికాకు వలస వెళ్లిపోయారు. అక్కడే స్లొవీన్​ అమెరికన్​ ఉర్సులీన్​ బానీని కలిసి, వివాహం చేసుకున్నారు.

అయితే, సునితా విలియమ్స్​ తండ్రి స్వస్థలం గుజరాత్​లోని ఝులసన్​ అనే చిన్న గ్రామం. ఈ గ్రామంలో సుమారు 7వేల మంది ఉంటారు. సునితా విలియమ్స్​ సాధించిన ఘనతలు చూసి ఇక్కడి వారందరు గర్వపడుతుంటారు.

అంతేకాదు, ఈ గ్రామంలోని ఒక లైబ్రెరీకి సునితా విలియమ్స్​ పూర్వికుల పేరు ఉంటుంది. దీపక్​ పాండ్య తండ్రి, తాత ఇల్లు ఇప్పటికీ ఉంది.

సునితా విలియమ్స్​ మాత్రం తన మూలలను ఎప్పుడు మర్చిపోలేదు! నివేదికల ప్రకారం.. స్పేస్​ మిషన్స్​ పూర్తి చేసుకున్న తర్వాత సునితా విలియమ్స్​ 1972, 2007, 2013లో ఝులసన్​ గ్రామాన్ని సందర్శించారు. ఇక్కడి స్కూల్​కి డొనేషన్లు కూడా ఇచ్చారు. ఆ స్కూల్​లోని ప్రేయర్​ హాల్​లో సునితా విలియమ్స్​ తాత-నానమ్మల ఫొటోలు ఇప్పటికీ ఉన్నాయి.

జూన్​ 2024లో అంతరిక్షంలోకి వెళ్లిన సునితా విలియమ్స్​, అక్కడే చిక్కుకుపోయారని తెలిసిన ఝులసన్​ గ్రామస్థులు చాలా బాధపడ్డారు. ఆమె సురక్షితంగా భూమికి తిరిగిరావాలని అప్పటి నుంచి ప్రార్థనలు చేస్తూ, ప్రతి రోజు దీపం వెలిగిస్తున్నారు.

ఇంకొన్ని గంటల్లో భూమి మీదకు సునితా విలియమ్స్​..

గత ఏడాది జూన్ నుంచి సునితా విలియమ్స్​, బుచ్​ విల్మోర్​ ఐఎస్​ఎస్​లో ఉన్న విషయం తెలిసిందే. బోయింగ్ స్టార్​లైనర్​ని పరీక్షించిన తొలి వ్యోమగాములుగా విల్మోర్, విలియమ్స్ జూన్​లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అయితే, ప్రొపల్షన్ సిస్టమ్ పనిచేయకపోవడం వల్ల వారు స్పేస్​క్రాఫ్ట్​లో తిరిగి రావడం చాలా ప్రమాదకరంగా మారింది. అందుకే ఐఎస్​ఎస్​లో ఉండిపోయారు. వారిని అంతరిక్షంలోకి తీసుకెళ్లిన బోయింగ్​కు చెందిన స్టార్​లైనర్ క్యాప్సూల్ గత ఏడాదే భూమికి తిరిగి వచ్చింది. దీనికి బదులుగా స్పేస్​ఎక్స్ క్యాప్సూల్​లో వారిని భూమి మీదకు రప్పించాలని నాసా నిర్ణయించింది.

ఈ మేరకు ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం రాత్రి మార్చ్ 14 రాత్రి​ 7.03 గంటలకు క్రూ-10 మిషన్​లో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ నలుగురు సభ్యుల బృందంతో నింగిలోకి ఎగిరింది. ఆ తర్వాతి రోజు అది ఐఎస్​ఎస్​కు చేరింది.

ఇక స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటల 57 నిమిషాలకు గల్ఫ్​ ఆఫ్​ మెక్సికో తీరం వద్ద దిగనున్నారు సునితా విలియమ్స్​, బుచ్​ విల్మోర్​.

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.