Shiv sena crisis | షిండే వర్గానికే శివసేన లోక్సభాపక్ష నేత పదవి!
శివసేన లోక్సభాపక్ష నేత పదవి తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే వర్గానికే లభించినట్లు సమాచారం. తన వర్గానికి చెందిన రాహుల్ షెవాలేను శివసేన లోక్సభాపక్ష నేతగా స్పీకర్ ఓం బిర్లా గుర్తించారని షిండే ప్రకటించారు. అయితే, దీనిపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Shiv sena crisis | తమ వర్గానికి చెందిన ఎంపీనే లోక్సభాపక్ష నేతగా, చీఫ్ విప్గా గుర్తించాలని అటు ఉద్ధవ్ ఠాక్రే, ఇటు ఏక్నాథ్ షిండే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖలు స్పీకర్ ఓం బిర్లా పరిశీలనలో ఉన్నాయి. దీనిపై ఓం బిర్లా జులై 20, బుధవారం నిర్ణయం తీసుకోనున్నారు. రాహుల్ షెవాలేను శివసేన లోక్సభాపక్ష నేతగా గుర్తించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ట్రెండింగ్ వార్తలు
Shiv sena crisis | 12 మంది ఎంపీలు షిండే వైపు..
శివసేనకు లోక్సభలో 19 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం వారిలో 12 మంది ఎంపీలు షిండే వర్గంలో ఉన్నారు. వారంతా ఎంపీ రాహుల్ షెవాలేను శివసేన లోక్సభాపక్ష నేతగా స్పీకర్ గుర్తించాలని స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. అలాగే, భావన గవాలిని పార్టీ చీఫ్ విప్గా కొనసాగించాలని కూడా ఆ ఎంపీలు స్పీకర్ను కోరారు. దాంతో పాటు, ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే సహా శివసేన షిండే వర్గ ఎంపీలంతా మంగళవారం స్పీకర్ ఓం బిర్లాను వ్యక్తిగతంగా కలుసుకుని, తమ అభ్యర్థనలను వివరించారు.
Shiv sena crisis | మాతోనే మెజారిటీ ఎంపీలు
మెజారిటీ ఎంపీలు తనవైపే ఉన్నారని, పార్టీ ఫౌండర్ బాలాసాహెబ్ ఆదర్శాలను తాము మాత్రమే ముందుకు తీసుకెళ్లగలమని వారంతా విశ్వసిస్తున్నారని షిండే పేర్కొన్నారు. ఎంపీ రాహుల్ షెవాలేను శివసేన లోక్సభాపక్ష నేతగా స్పీకర్ ఓం బిర్లా గుర్తించారని ప్రకటించారు. అయితే, శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఎంపీ వినాయక్ రౌత్ నాయకత్వంలో మిగతా సేన ఎంపీలు సోమవారమే స్పీకర్ ఓం బిర్లాను కలిసి తమ విన్నపాన్ని వివరించారు. శివసేన పార్లమెంటరీ బోర్డు నేతను తానేనని స్పీకర్ కు రౌత్ విన్నవించారు.