కేరళను తాకిన రుతుపవనాలు! 16ఏళ్లల్లో తొలిసారి ఇంత త్వరగా..-southwest monsoon 2025 arrives in kerala earliest onset in 16 years see forecast ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  కేరళను తాకిన రుతుపవనాలు! 16ఏళ్లల్లో తొలిసారి ఇంత త్వరగా..

కేరళను తాకిన రుతుపవనాలు! 16ఏళ్లల్లో తొలిసారి ఇంత త్వరగా..

Sharath Chitturi HT Telugu

నైరుతి రుతుపవనాలపై బిగ్​ అప్డేట్​! కేరళ రాష్ట్రాన్ని రుతుపవనాలు శనివారం తాకాయి. ఇంత త్వరగా దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించడం 16ఏళ్లల్లో తొలిసారి కావడం విశేషం.

నైరుతు రుతుపవనాల ఆగమనం.. (HT_PRINT)

నైరుతి రుతుపవనాలు కేరళను శనివారం తాకాయి! సాధారణంగా జూన్​ మొదటి వారంలో దేశాన్ని తాకే రుతుపవనాలు ఈసారి మే 27నే వస్తాయని ఐఎండీ (భారత వాతావరణశాఖ) తొలుత అంచనా వేసింది. ఇక 24 గంటల్లో కేరళను తాకుతాయని ఐఎండీ వెల్లడించింది. అక్కడి నుంచి కొన్ని గంటల్లోనే, రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయని ఒక ప్రకటన చేసింది. రుతుపవనాలు ఇంత త్వరగా కేరళను తాకడం 16ఏళ్లల్లో ఇదే తొలిసారి!

కేరళలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా రుతుపవనాలు కేరళను త్వరగా తాకేందుకు ఈసారి అన్ని సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే ఈసారి రుతుపవనాలు త్వరగా రాష్ట్రంలోకి ప్రవేశించిన్నట్టు ఐఎండీ వెల్లడించింది.

తొందరగా- ఆలస్యంగా..

భారత వాతావరణశాఖ ప్రకారం.. చివరిసారిగా 2001, 2009లో మే 23వ తేదీన రుతుపవనాలు కేరళను తాకాయి. కాగా 1918 మే 11న రుతుపవనాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. ఇక 1972 ఏడాదిలో జూన్​ 18న నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఇదే అత్యంత ఆలస్యమైన రాక! గడిచిన 25ఏళ్లల్లో చూసుకుంటే మాత్రం 2016 జూన్​ 9న.. 9 రోజుల ఆలస్యంతో ఎంట్రీ ఇచ్చాయి.

భారీ వర్షాలు పక్కా..

రుతుపవనాల ఎంట్రీతో దక్షణాధి రాష్ట్రాలైన కేరళ, కర్ణాటకతో పాటు కోంకణ్​- గోవా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.

మరీ ముఖ్యంగా కేరళ, కర్ణాటకలో మే 29 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. ఈ సమయంలో గంటకు 40-50 కేఎంపీహెచ్​ వేగంతో గాలులు వీస్తాయని వివరించింది.

ఐఎండీ ప్రకారం.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో కూడా రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయి.

వివిధ ప్రాంతాల్లో ఐఎండీ వర్ష సూచనకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

హైదరాబాద్​లో పరిస్థితి ఇలా..

సాధారణంగా మే నెల అంటే భానుడి భగభగలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. కానీ ఈసారి దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండా కాలంలోనూ వర్షాలు పడ్డాయి. ఇక రుతుపవనాలు తొందరగా వస్తుండటంతో తెలంగాణలోని అనేక చోట్ల ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్​లో శుక్రవారం నాడు ఉష్ణోగ్రతలు 7-8 డిగ్రీల సెల్సియస్​ వరకు డ్రాప్​ అయ్యాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత 32.2 డిగ్రీలుగా నమోదైంది. సాధారణంతో పోల్చుకుంటే ఇది 7.8 డిగ్రీలు తక్కువ!

రానున్న ఏడు రోజుల పాటు హైదరాబాద్​లో ఆకాశం మేఘావృత్తమై ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. మధ్య మధ్యలో వర్షాలు పడతాయని వివరించింది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.