Snake in Mid-day Meal: మధ్యాహ్న భోజనంలో పాము.. విద్యార్థులకు అస్వస్థత
Snake in Mid-day Meal: ఓ ప్రైమరీ పాఠశాల మధ్యాహ్నం భోజనంలో పాము కనిపించిది. ఆ ఆహారం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని అక్కడి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.
Snake in Mid-day Meal: ఓ పాఠశాల మధ్యాహ్నం భోజనంలో ఏకంగా పాము కనిపించింది. పిల్లలకు ఆహారం వడ్డించాక పాత్ర అడుగున పాము ఉంది. ఈ భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్ (West Bengal) లోని బీర్భూమ్ (Birbhum) జిల్లాలో ఈ ఘటన జరిగింది. అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు.
ట్రెండింగ్ వార్తలు
30 మంది విద్యార్థులకు అస్వస్థత
Snake in Mid-day Meal in West Bengal: బీర్భూమ్ జిల్లా మయూరేశ్వర్లోని ఓ ప్రైమరీ పాఠశాలలో సోమవారం వండిన మధ్యాహ్నం భోజనంలో పాము కనిపించింది. ఆ ఆహారం తిన్న తర్వాత పాఠశాలకు చెందిన సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పప్పు వండిన పాత్రలో పాము ఉందని ఆ వంట చేసిన పాఠశాల సిబ్బంది కూడా చెప్పారు.
“విద్యార్థులు వాంతులు చేసుకోవడం ప్రారంభించిన వెంటనే వారిని, రామ్పూర్హాట్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి విద్యార్థులను తరలించాం” అని ఆ పాఠశాల సిబ్బందిలో ఒకరు చెప్పారు.
మధ్యాహ్న భోజనం తిన్నతర్వాత పిల్లలు అస్వస్థతకు లోనయ్యారని తమకు ఫిర్యాదులు వచ్చాయని అక్కడి బ్లాక్ డెవలప్మెంట్ అధికారి దిపంజన్ జనా.. మీడియాకు వెల్లడించారు. స్కూల్కు వెళ్లి పరిస్థితి పర్యవేక్షిస్తామని అన్నారు.
అస్వస్థతకు గురైన విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది. చాలా మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా, ఈ ఘటనపై ఆగ్రహించిన పిల్లల తల్లిదండ్రులు.. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ముట్టడించి నిరసన తెలిపారని పోలీసులు వెల్లడించారు. ఆ ఉపాధ్యాయుడి ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారని వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు.
మధ్యాహ్న భోజనంలో చికెన్
Chicken in Mid-day meal: మధ్యాహ్నం భోజనంలో పాఠశాల విద్యార్థులకు చికెన్ కూడా అందించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి ఏప్రిల్ వరకు అంటే నాలుగు నెలల పాటు భోజనం మెనూలో చికెన్ చేర్చనున్నట్టు ప్రకటించింది. చికెన్తో పాటు సీజన్వారిగా పండ్లను కూడా పిల్లలకు ఇవ్వనున్నట్టు వెల్లడించింది. అయితే.. ఈ విషయం బెంగాల్లో రాజకీయ రంగు పులుముకుంది. మధ్యాహ్న భోజనంలో చికెన్ను నాలుగు నెలలకు మాత్రమే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పరిమితం చేస్తోందని బీజేపీ ప్రశ్నించింది. త్వరలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని, వీటిలో లబ్ధి పొందేందుకే తృణమూల్ పార్టీ ఈ నిర్ణయాన్ని తీసుకుందని విమర్శించింది.