PM Modi leave : 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్క సెలవు కూడా తీసుకోలేదు! ఈ మేరకు ఓ ఆర్టీఐ (రైట్ టు ఇన్ఫర్మేషన్) ప్రశ్నకు సమాధానం ఇచ్చింది పీఎంఓ (ప్రధానమంత్రి కార్యాలయం).
ఆర్టీఐ ద్వారా రెండు ప్రశ్నలు వేశారు ప్రఫుల్ పీ. శార్ద. 2014 నుంచి ఇప్పటివరకు మోదీ ఎన్ని రోజులు కార్యాలయానికి వచ్చారు? ప్రధాని అయిన తర్వాత మోదీ.. ఎన్ని ఈవెంట్స్, ఫంక్షన్లకు హాజరయ్యారు? అని తెలుసుకునేందుకు ఆర్టీఐ దాఖలు చేశారు. 2013 జులై 31న ఈ ఆర్టీఐని దాఖలు చేశారు.
వీటికి పీఎంఓ తాజాగా జవాబులిచ్చింది. "ప్రధానమంత్రి నిరంతరం డ్యూటీలోనే ఉన్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మోదీ ఒక్క సెలవు కూడా తీసుకోలేదు," అని మొదటి ప్రశ్నకు సమాధానాన్ని ఇచ్చింది. ఇక రెండో ప్రశ్నకు సైతం పీఎంఓ రిప్లై ఇచ్చింది. '2014 మేలో మోదీ పీఎంఓలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన పాల్గొన్న ఫంక్షన్ల సంఖ్య (దేశ, విదేశ) 3000ను దాటింది,' అని స్పష్టం చేసింది.
PM Modi latest news : ఈ ఆర్టీఐ కాపీని సోషల్ మీడియాలో షేర్ చేశారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.
2015లోను ఇలాంటి ఆర్టీఐనే ఒకటి ఫైల్ అయ్యింది. 'ప్రధాని మోదీ ఇప్పటివరకు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు,' అని నాడు పీఎంఓ చెప్పింది.
ప్రధాని మోదీ.. గత 20ఏళ్లల్లో ఒక్కసారి కూడా సెలవు తీసుకోలేదని, పనిపై ఆయనకు ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం అని 2019లో జరిగిన ఓ ఈవెంట్లో వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రి అమిత్ షా.
ఈ విషయంపై ప్రధాని మోదీ మీద ఇటీవలే ప్రశంసల వర్షం కురిపించారు విదేశాంగమంత్రి జైశంకర్.
PM Modi PMO : "ఈ సమయంలో ప్రధాని పదవిలో మోదీ లాంటి వ్యక్తి ఉండటం.. దేశానికే శుభపరిణామం. ఆయన ప్రధాని అని, నేను కేబినెట్ మంత్రినని ఈ విషయం చెప్పడం లేదు. పని పట్ల ఆయనకు ఉన్న అంకిత భావాన్ని దృష్టిలో పెట్టుకుని చెబుతున్నాను," అని.. బాంకాక్లో జరిగిన ఓ ఈవెంట్లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు జైశంకర్.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా చురుకుగా ఉంటారు. ఎన్నికలైనా, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలైనా.. ఆయన హాజరవుతారు. సమయం దొరికినప్పుడల్లా.. ప్రజలను కలిసేందుకు ఇష్టపడుతుంటారు. నూతన పార్లమెంట్ భవనం నిర్మాణ దశలో ఉన్నప్పుడు.. షెడ్యూల్లో లేనప్పటికీ అనేక మార్లు అక్కడికి వెళ్లి, కార్మికులను కలిశారు. వారితో ముచ్చటించారు.
సంబంధిత కథనం