Maharashtra crisis | మాది `శివసేన బాలాసాహెబ్ వర్గం`
శివసేనలో సంక్షోభం ముదురుతోంది. పార్టీ నేత ఏక్నాథ్ షిండే నేతృత్వంలో రెబెల్ ఎమ్మెల్యేలు గువాహటిలోని ఒక హోటల్లో బస చేశారు. వారు తమ వర్గం పేరును `శివసేన బాలాసాహెబ్ వర్గం`గా పిలుచుకుంటున్నారు.
రెబెల్ గ్రూప్ పేరును `శివసేన బాలాసాహెబ్`గా నిర్ణయించినట్లు తిరుగుబాటు ఎమ్మెల్యే, మాజీ మంత్రి దీపక్ కేసర్కర్ వెల్లడించారు. తమ వద్ద ప్రస్తుతం 38 మంది శివసేన ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన వెల్లడించారు.
ట్రెండింగ్ వార్తలు
రెబల్ గ్రూప్ సమాలోచనలు
భవిష్యత్ కార్యాచరణపై ఏక్నాథ్ షిండే నేతృత్వంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు సమాలోచనలు చేస్తున్నారు. ఇటు గవర్నర్ను, అటు ఎన్నికల సంఘాన్ని కలిసి నిజమైన శివసేన తమదేనని వివరణ ఇవ్వాలని యోచిస్తున్నారు. అయితే, అందుకు సరైన సమయమేంటనే విషయంపై గ్రూప్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, రెబల్ ఎమ్మెల్యేల ఇళ్లు, ఆఫీస్లపై శివసైనికులు దాడులు చేస్తున్నారు. పుణెలో ప్రస్తుతం గువాహటి హోటల్లో ఉన్న రెబల్ ఎమ్మెల్యే తానాజీ సావంత్ ఇంటిపై దాడి చేశారు. పలువరు ఇతర రెబల్ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం షిండేతో 38 మంది శివసేన ఎమ్మెల్యేలు, 9 మంది ఇండిపెండెంట్లు ఉన్నట్లు సమాచారం.
సెక్యూరిటీ తీసేశారు
రెబల్ ఎమ్మెల్యేల సెక్యూరిటీని తొలగించారని ఏక్నాథ్ షిండే ఆరోపించారు. ఈ మేరకు ఆయన సీఎం ఉద్దవ్ ఠాక్రేకు లేఖ రాశారు. తనతో పాటు గువాహటిలో ఉన్న 38 మంది ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల సెక్యూరిటీని కావాలనే, దురుద్దేశపూర్వకంగా తొలగించారని ఆయన ఆరోపించారు. ఇది తమపై కక్ష సాధింపేనన్నారు. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల ప్రాణాలకు ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ ఆరోపణలను మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ కొట్టిపారేశారు. ఎవరి సెక్యూరిటీని తొలగించలేదని స్పష్టం చేశారు.
రాష్ట్రపతి పాలన పెట్టాలి
ఉద్ధవ్ ఠాక్రే గుండాయిజం ఇకపై చెల్లదని అమరావతి ఎంపీ నవనీత్ రాణా వ్యాఖ్యానించారు. వెంటనే, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశానన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు, వారి కుటుంబ సభ్యులుకు భద్రత కల్పించాలని ఆమె కోరారు.