Encounter : ఛత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్​- 14 మంది మావోయిస్టులు హతం!-several maoists killed in chhattisgarh encounter with police at gariaband ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Encounter : ఛత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్​- 14 మంది మావోయిస్టులు హతం!

Encounter : ఛత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్​- 14 మంది మావోయిస్టులు హతం!

Sharath Chitturi HT Telugu
Jan 21, 2025 12:49 PM IST

Chhattisgarh encounter live : ఛత్తీస్​గఢ్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో 14 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎన్​కౌంటర్​ ఇంకా కొనసాగుతోంది. మావోయిస్టుల మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

14 మంది మావోయిస్టులు హతం!
14 మంది మావోయిస్టులు హతం! (PTI)

ఛత్తీస్​గఢ్​ ఒడిశా సరిహద్దులోని గరియాబంద్​ జిల్లాలో కాల్పుల మోత మోగింది! పోలీసులు- మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్​కౌంటర్​లో ఇప్పటివరకు కనీసం 14 మంది మావోయిస్టులు మరణించారు. కోటి రూపాయల రివార్డు ఉన్న మావోయిస్టు కూడా  ఈ ఎన్​కౌంటర్​లో హతమైనట్లు పోలీసులు తెలిపారు. ఎన్​కౌంటర్​ కొనసాగుతోందని స్పష్టం చేశారు.

yearly horoscope entry point

14మంది మావోయిస్టులు హతం..!

ఛత్తీస్​గఢ్ ఒడిశా సరిహద్దులోని మెయిన్​పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో సోమవారం అర్థరాత్రి, మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఎన్​కౌంటర్​ జరిగింది. ఛత్తీస్​గడ్​ ఎన్​కౌంటర్​లో మరణించిన మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని అధికారులు వెల్లడించారు. మావోయిస్టుల మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఆపరేషన్​లో భాగంగా ఒక కోబ్రా జవాను గాయపడినట్లు తెలిపారు.

ఈ ఎన్​కౌంటర్​లో మావోయిస్ట్ అగ్రనేత ప్రతాప్‌ రెడ్డి రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి మృతి చెందారు. చిత్తూరు జిల్లాకు చెందిన చలపతి 30ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. ఆయనపై కోటి రుపాయల రివార్డు ఉంది. ఆయన భార్య అరుణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.

డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), ఛత్తీస్​గఢ్​కి చెందిన కోబ్రా, ఒడిశాకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజీ)లకు చెందిన భద్రతా సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్​లో పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్‌- ఒడిశాకు చెందిన పోలీసు అధికారులు ఆపరేషన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఒడిశాలోని నువాపాడా జిల్లా సరిహద్దుకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్​గఢ్​లోని కులారిఘాట్ రిజర్వ్ ఫారెస్ట్​లో మావోయిస్టులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు జనవరి 19 రాత్రి ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

సోమవారం జరిగిన ఆపరేషన్​లో ఇద్దరు మహిళా మావోయిస్టులను మట్టుబెట్టామని, ఎన్​కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున తుపాకులు, మందుగుండు సామగ్రి, ఐఈడీలు, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్​ను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.

మరణించిన మావోయిస్టుల మృతదేహాల కింద ఐఈడీలు ఉండి ఉండొచ్చని భద్రతా దళాలు అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది.

మావోయిస్టులపై భారీ ఆపరేషన్​..!

జనవరి 6న ఛత్తీస్​గఢ్​ బీజాపూర్​లో నక్సలైట్లు జరిపిన ఐఈడీ దాడిలో ఎనిమిది మంది డిస్ట్రిక్ట్​ రిజర్వ్​ గార్డ్ జవాన్లు, ఒక డ్రైవర్​ మరణించారు. ఈ నేపథ్యంలో 2026 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పునరుద్ఘటించారు. అప్పటి నుంచి మావోయిస్టులపై భద్రదళాలు విరుచుకుపడుతున్నారు.

ఈ ఒక్క నెలలో ఛత్తీస్​గఢ్​లోని వేరువేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్​కౌంటర్​లో 30కిపైగా మంది మావోయిస్టులు హతమయ్యారు. 12న బీజాపూర్​లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. జనవరి 16న అదే బీజాపూర్​లో జరిగిన మరో ఎన్​కౌంటర్​లో 12మంది మావోయిస్టులు ప్రాణాలు విడిచారు.

ఇక గతేడాది భద్రతా దళాలతో వివిధ సందర్భాల్లో జరిగిన ఎన్​కౌంటర్స్​లో 219మంది మావోయిస్టులు హతమయ్యారని డేటా చెబుతోంది.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.