Supreme Court: ‘తమిళనాడు గవర్నర్ కు సుప్రీంకోర్టు షాక్; బిల్లుల ఆమోదం విషయంలో మార్గదర్శకాలు-setback for tn governor must give assent to bills no pocket veto says sc ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Supreme Court: ‘తమిళనాడు గవర్నర్ కు సుప్రీంకోర్టు షాక్; బిల్లుల ఆమోదం విషయంలో మార్గదర్శకాలు

Supreme Court: ‘తమిళనాడు గవర్నర్ కు సుప్రీంకోర్టు షాక్; బిల్లుల ఆమోదం విషయంలో మార్గదర్శకాలు

Sudarshan V HT Telugu

Supreme Court: తమిళనాడు గవర్నర్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బిల్లులకు ఆమోదం తెలపకుండా సుదీర్ఘంగా జాప్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బిల్లుల ఆమోదానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వాగతించారు.

తమిళనాడు గవర్నర్ కు సుప్రీంకోర్టు షాక్ (HT_PRINT)

Supreme Court: రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించే బిల్లులకు సంబంధించి గవర్నర్ల పాత్రపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్రపతి పరిశీలనకు 10 బిల్లులను రిజర్వ్ చేస్తూ తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ కు విచక్షణాధికారం లేదని, మంత్రిమండలి సలహా మేరకే నడుచుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ల ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 బిల్లుల ఆమోదానికి సంబంధించినది.

పూర్తిగా నిలిపేయలేరు..

బిల్లుల ఆమోదాన్ని గవర్నర్ పూర్తిగా నిలుపుదల చేయలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సంపూర్ణ వీటో లేదా పాకెట్ వీటో భావనలను వర్తింపజేయలేరని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగ వ్యవస్థలో 'సంపూర్ణ వీటో' లేదా 'పాకెట్ వీటో' అనే భావన లేదని జస్టిస్ పర్దివాలా తన తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పుతో ఎన్నికైన ప్రభుత్వాలు బలపడతాయని, గవర్నర్లు మంత్రిమండలి సలహాలు, రాజ్యాంగ చట్రానికి అనుగుణంగా ఉండేలా చూస్తామని జస్టిస్ పర్దివాలా తన తీర్పులో పేర్కొన్నారు.

మూడు ఆప్షన్లలో ఒకటి ఎంచుకోవాల్సిందే

ఏదైనా బిల్లు తన వద్దకు వచ్చినప్పుడు, గవర్నర్ ముందు మూడు ఆప్షన్స్ ఉంటాయని సుప్రీంకోర్టు వివరించింది. అవి 1. బిల్లులకు ఆమోదం తెలపడం, 2. బిల్లులను ఆమోదించకపోవడం 3. రాష్ట్రపతి పరిశీలనకు పంపించడం. అనే మూడు ఆప్షన్లలో ఒకదాన్ని గవర్నర్ ఎంచుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ కు విచక్షణాధికారం లేదని, మంత్రిమండలి సలహాలు, సూచనల మేరకే నడుచుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు

రెండో సారి కుదరదు

రెండోసారి బిల్లును రాష్ట్రపతికి సమర్పించిన తర్వాత మళ్లీ అ అదే బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయడానికి గవర్నర్ కు అవకాశం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే బిల్లులో మార్పులు లేకపోతే రెండో సారి తన వద్దకు వచ్చిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంటుందని పేర్కొంది. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి ఆమోదం పెండింగ్ లో ఉన్న అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వాగతించారు.

హుటాహుటిన బిల్లులకు గవర్నర్ ఆమోదం

ఈ బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసినట్లు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కొద్దిసేపటికే స్టాలిన్ అసెంబ్లీలో తెలిపారు. పలు అంశాలపై డీఎంకే, గవర్నర్ మధ్య గత కొంత కాలంగా విభేదాలు తలెత్తాయి.

తీర్పులోని ఐదు కీలక అంశాలు

  • బిల్లుల నిర్ణయానికి కాలపరిమితి: రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలి.
  • ప్రజల అభీష్టాన్ని గౌరవించాలి: రాజ్యాంగ అధిపతులుగా గవర్నర్లు ప్రజల అభీష్టాన్ని గౌరవించాలి. మంత్రిమండలి సలహా మేరకు నడుచుకోవాలి.
  • బిల్లులను రాష్ట్రపతికి రిజర్వ్ చేసే విచక్షణ లేదు: రెండోసారి బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వు చేసే విచక్షణ గవర్నర్లకు లేదు.
  • ఆర్టికల్ 200 ప్రకారం చర్యలు: ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ మంత్రిమండలి సలహాలు, సూచనల మేరకు వ్యవహరించాలి తప్ప బిల్లులపై నిర్ణయం తీసుకోవడంలో విచక్షణాధికారాన్ని ఉపయోగించకూడదు.
  • తమిళనాడు గవర్నర్ తప్పిదం: తమిళనాడు గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపించడం తప్పు. ఆర్టికల్ 200 ఉల్లంఘన.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.