Maharashtra politics | `బాలాసాహెబ్ పేరు వాడొద్దు`
పార్టీ చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన శివసేన జాతీయ కార్యవర్గ సమావేశం శనివారం జరిగింది. పార్టీలో తిరుగుబాటు నేపథ్యంలో.. దివంగత నేత, శివసేన వ్యవస్థాపకుడు బాలా సాహెబ్ బాల్ ఠాక్రే పేరును వేరే ఎవరూ రాజకీయ అవసరాలకు వాడకూడదని ఒక తీర్మానాన్ని ఈ భేటీలో ఆమోదించారు.
శివసేనలో తిరుగుబాటు నేపథ్యంలో పలు తీర్మానాలను పార్టీ జాతీయ కార్యవర్గం ఆమోదించింది. తిరుగుబాటు వర్గం కూడా బాలాసాహెబ్ పేరును వాడుకుంటున్న నేపథ్యంలో.. బాల్ ఠాక్రే పేరు దుర్వినియోగం కాకుండా ఉండడం కోసం, వేరే ఎవరు కూడా ఆ పేరును తమ రాజకీయ అవసరాలకు వాడకూడదని ఒక తీర్మానాన్ని ఈ సమావేశంలో ఆమోదించారు.
ట్రెండింగ్ వార్తలు
రెబల్స్ పై చర్యలు
దాదాపు 38 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బృందంలో ఉన్న నేపథ్యంలో.. వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు అప్పగిస్తూ.. మరో తీర్మానాన్ని కూడా ఈ సమావేశంలో ఆమోదించారు. అలాగే, బాల్ ఠాక్రే పేరుతో పాటు పార్టీ పేరు, జెండాను కూడా వేరే ఎవరు వాడకూడదని కోరుతూ ఎన్నికల సంఘానికి శివసేన ఒక లేఖ రాసింది. ``శివసేనలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయి. పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏక్నాథ్ షిండే నాయకత్వంలో కొందరు ఎమ్మెల్యేలు పని చేస్తున్నారు. శివసేన పేరునూ, బాలాసాహెబ్ పేరును ఉపయోగిస్తూ వారు మరో కొత్త పార్టీని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని మేం అనుమానిస్తున్నాం. ఇది శివసేన పేరును, బాలాసాహెబ్ బాల్ ఠాక్రే పేరును అవమానించడం, దుర్వినియోగం చేయడంగా భావిస్తున్నాం. ఆ ప్రయత్నాలను అడ్డుకోవాల్సిందిగా కోరుతున్నాం` అని శివసేన ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొంది.
పార్టీ పెట్టుకుంటే అడ్డుకోం
ఎవరైనా సరే.. శివసేన నుంచి వెళ్లిపోయి, వేరే పార్టీ పెట్టుకుంటే తమకు అభ్యంతరం లేదని, అయితే, వారు శివసేనను కానీ, బాలా సాహెబ్ను కానీ గుర్తు తెచ్చేలా పార్టీ పేరును, జెండాను ఏర్పాటు చేసుకోకూడదని కోరుతున్నామని శివసేన కోరింది.
నమ్మక ద్రోహం మర్చిపోం
పార్టీకి, తమకు నమ్మక ద్రోహం చేసిన వారిని మర్చిపోమని శివసేన యువ నేత, సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే హెచ్చరించారు. ప్రజలు అన్నీ చూస్తున్నారని, సామాన్య కార్యకర్తలెవరూ పార్టీని వీడరని ధీమా వ్యక్తం చేశారు. కాగా, శివసేన యువజన విభాగమైన `యువసేన` కార్యవర్గ సమావేశం ఆదివారం ముంబైలో జరగనుంది.
రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసు
తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో 16 మందికి మహారాష్ట్ర డెప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ శనివారం నోటీసులు జారీ చేశారు. వారిపై అనర్హత వేటు ఎందుకు వేయకూడదో వివరించాలని షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బుధవారం జరిగిన శాసనసభాపక్ష సమావేశానికి ఎందుకు హాజరుకాలేదో, పూర్తి ఆధారాలతో జూన్ 27 సాయంత్రం 5 గంటలలోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.
టాపిక్