సోషల్ మీడియా, ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్ఫామ్లలో అశ్లీల కంటెంట్ను నియంత్రించాలని లేదా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం స్పందన కోరుతూ సోమవారం సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది.
న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్. గవాయ్, ఏ.జి. మాసి ఉన్న ధర్మాసనం ప్రధాన ఓటీటీ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు కూడా నోటీసులు జారీ చేసింది.
అయితే, ఈ విషయంలో తమ జోక్యం పరిమితం అవుతుందని, అలాంటి కంటెంట్ను నియంత్రించడానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోర్టు పేర్కొంది.
"ఇది శాసనసభ లేదా కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన విషయం. ప్రస్తుతం, శాసన మరియు కార్యనిర్వాహక విధులలో జోక్యం చేసుకుంటున్నారని కొందరు మమ్మల్ని విమర్శిస్తున్నారు" అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ చేసిన తాజా విమర్శలను ఉటంకిస్తూ ధర్మాసనం పేర్కొంది.
ఈ నెల ప్రారంభంలో బిల్లులకు గవర్నర్ ఆమోదంపై సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ధన్ఖర్ న్యాయవ్యవస్థను విమర్శిస్తూ కోర్టులు రాష్ట్రపతికి ఆదేశాలు జారీ చేయలేవని అన్నారు.
కాగా అశ్లీల కంటెంట్పై ఉదయ్ మహుర్కర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)ను కోర్టు విచారణ చేసింది. న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వాదనలు వినిపిస్తూ, అనుచిత కంటెంట్కు తగిన నియంత్రణ లేకుండా ఆన్లైన్లో విస్తృతంగా అందుబాటులో ఉందని వాదించారు.
కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నివేదిస్తూ కొన్ని నిబంధనలు ఇప్పటికే ఉన్నాయని, అదనపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. OTT ప్లాట్ఫామ్లలో పిల్లలకు అశ్లీల భాష, అశ్లీ చిత్రాల వల్ల ప్రభావితులవుతారనే ఆందోళనలను ఆయన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ PIL ను వ్యతిరేకంగా పరిగణించబోదని అన్నారు.
"కొన్ని సాధారణ కార్యక్రమాలలో భాష చాలా అశ్లీలంగా ఉంటుంది. ఇద్దరు పురుషులు కూడా కలిసి చూడలేరు" అని మెహతా అన్నారు.
ధర్మాసనం దీనితో ఏకీభవించి, పిల్లలు తరచుగా అలాంటి కంటెంట్ను పర్యవేక్షణ లేకుండా యాక్సెస్ చేస్తారని పేర్కొంది. ఈ విషయం గురించి తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయని నొక్కి చెబుతూ, కంటెంట్ను కఠినంగా నియంత్రించే బాధ్యత ప్రధానంగా శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక శాఖలపైనే ఉందని కోర్టు పునరుద్ఘాటించింది.
తన PILలో మహుర్కర్ కోర్టు జోక్యం కోరుతూ, భవిష్యత్ తరాల నైతికతను దెబ్బతీసేలా కంటెంట్ ఉంటోందని అన్నారు.
ఓటీటీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తరచుగా అశ్లీల కంటెంట్ను హోస్ట్ చేస్తాయని, అలాంటి కంటెంట్ను తనిఖీ చేసి నిషేధించడానికి తగిన నిబంధనలు లేకపోవడం వల్ల యువత, పిల్లలు కూడా దాని ప్రభావానికి గురవుతున్నారని వాదించారు.
కోర్టు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం "తీవ్రమైన ఆందోళనలను" లేవనెత్తిందని గమనించి, దాన్ని వినడానికి అంగీకరించింది. ఇంతకుముందు దాఖలైన ఇలాంటి పిటిషన్లతో కలిపి ఈ పిటిషన్ను విచారణ చేయాలని కోర్టు నిర్ణయించింది.