Bank Offenders | వారి నుంచి రూ. 18 వేల కోట్లు రాబట్టాం: కేంద్ర ప్రభుత్వం వెల్లడి
విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల నుంచి ఆయా బ్యాంకులు ఇప్పటివరకు రూ. 18,000 కోట్లు రికవరీ చేశాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపారు.
New Delhi | బ్యాంకుల నుంచి వేలకోట్ల రూపాయలను లోన్లుగా తీసుకొని, ఆ తర్వాత తిరిగి చెల్లించకుండా పంగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన వారి గురించి కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలు వెల్లడించింది.
ట్రెండింగ్ వార్తలు
విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల నుంచి ఆయా బ్యాంకులు ఇప్పటివరకు రూ. 18,000 కోట్లు రికవరీ చేశాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. వీరి ముగ్గురిపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసుల నమోదయ్యాయి. ప్రస్తుతం వీరి మొత్తం అప్పుల విలువ రూ. 67,000 కోట్లు ఉందని ఆయన ధర్మాసనానికి విన్నవించారు.
మనీ లాండరింగ్ కేసులకు సంబంధించి దాఖలైన వివిధ పిటిషన్లపై జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అలాంటి కేసులకు సంబంధించిన పురోగతిని ధర్మాసనానికి వివరించారు. పరారీలో ఉన్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలను 'ఆర్థిక నేరస్తులు' గా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని ఆయన తెలిపారు. వీరిని భారత్ తీసుకువచ్చే ప్రయత్నాలూ జరుగుతున్నాయని ఎస్జీ స్పష్టం చేశారు.
కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ యజమాని విజయ్ మాల్యా రూ. 9,000 కోట్లకు పైగా బ్యాంక్ రుణం ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఆ తర్వాత మాల్యా లండన్ పారిపోయి అక్కడే తలదాచుకుంటున్నాడు. గతంలో సుప్రీంకోర్టు విచారణకు కూడా హాజరుకాకపోవడంతో అతడిపై కోర్టు ధిక్కరణ కేసులు కూడా నమోదయ్యాయి. చివరి అవకాశంగా మాల్యా గురువారం సుప్రీంకోర్టులో హాజరు కావాల్సి ఉంది. అయితే మాల్యా తరఫున అతడి న్యాయవాదులు హాజరు కానున్నారు. ఈ కేసును జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించనుంది.
ఇక, పంజాబ్ నేషనల్ బ్యాంక్కు సంబంధించిన రూ. 13,500 కోట్ల రుణం ఎగవేత కేసులో డైమండ్ వర్తకుడైన నీరవ్ మోదీ నిందితుడిగా ఉన్నాడు. ఇతడు కూడా లండన్లోనే ఉన్నాడు. ఇతణ్ని భారతదేశానికి అప్పగించడం పెండింగ్లో ఉంది.
పీఎన్బీకి సంబంధించిన ఫ్రాడ్ కేసులోనే నీరవ్ మోదీ మామయ్య మెహుల్ చోక్సీ అనుమానాస్పదంగా డొమినికా దేశంలో పట్టుబడ్డాడు. అనంతరం బెయిల్ మీద విడుదలై అక్కడ్నించి కూడా పరారై ప్రస్తుతం కరేబియన్ ద్వీపంలోని ఆంటిగ్వాలో తలదాచుకుంటున్నట్లు సమాచారం.
సంబంధిత కథనం