Jharkhand Assembly elections: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ, సీపీఎంలతో కూడిన ఇండియా కూటమి ఏడు హామీలను ప్రకటిస్తూ ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. రాంచీలో జరిగిన మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇస్తున్న ఏ హామీ గురించి మాట్లాడినా ప్రధాని మోదీ వెంటనే విమర్శలు చేస్తారని ఖర్గే అన్నారు. ‘‘ప్రధాని మోదీ (narendra modi) ఇక్కడికి వచ్చి తన ప్రసంగంలో నా పేరును ప్రస్తావిస్తూ కాంగ్రెస్ హామీలకు విశ్వసనీయత లేదని అన్నారు. కాంగ్రెస్ తన హామీలన్నింటినీ నెరవేరుస్తుంది. కానీ మోదీ హామీలు ఎప్పటికీ నెరవేరవు’’ అని ఖర్గే (mallikarjun kharge) విమర్శించారు.
81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలను నవంబర్ 23న ప్రకటిస్తారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) 30 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, భారతీయ జనతా పార్టీ 25, కాంగ్రెస్ 16 స్థానాల్లో విజయం సాధించాయి. జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం) 3, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో జేఎంఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం 43 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 30 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపనుంది. రాష్ట్రీయ జనతాదళ్ (RJD) ఆరు స్థానాల్లో, వామపక్షాలు మూడు స్థానాల్లో పోటీ చేయనున్నాయి.