Kharge “Dog” Remark: ఖర్గే “డాగ్” కామెంట్పై బీజేపీ ఆగ్రహం.. రాజ్యసభలో రచ్చ.. ప్రజలు నవ్వుతున్నారని స్పీకర్ అసహనం
Mallikarjun Kharge vs BJP in Rajya Sabha: కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం రేగింది. ఆయన అభ్యంతరకరమైన భాష వాడారని, క్షమాపణలు చెప్పాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేసింది. సభలో గందరగోళం నెలకొనటంపై చైర్మన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Mallikarjun Kharge vs BJP in Rajya Sabha: కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్డున ఖర్గే వ్యాఖ్యలపై పార్లమెంట్లో మంగళవారం దుమారం రేగింది. ఖర్గే క్షమాపణలు చెప్పాల్సిందేనని అధికార బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)ను భారత్ తోడో యాత్ర అంటూ విమర్శిస్తున్న బీజేపీపై ఓ బహిరంగ సభలో నిన్న ఖర్గే ఎదరుదాడి చేశారు. ఈ క్రమంలో కుక్క (Dog) అనే పదాన్ని వాడారు. దీంతోపాటు ఖర్గే చేసిన ఇతర కామెంట్లపై కాషాయ పార్టీ ఎంపీలు మండిపడ్డారు. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
ఖర్గే ఏమన్నారంటే..
రాజస్థాన్లోని అల్వార్లో కాంగ్రెస్ సోమవారం నిర్వహించిన సభలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. రాహుల్ గాంధీ యాత్రను భారత్ తోడో యాత్ర అంటూ బీజేపీ విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ.. దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించిందని ఖర్గే అన్నారు. ఈ క్రమంలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ పాత్ర అసలు లేదని అన్నారు. “మీ ఇంట్లో కుక్క అయినా దేశం కోసం చనిపోయిందా? అయినా ఇంకా వారు (బీజేపీ) దేశభక్తులమని చెప్పుకుంటున్నారు. మేం ఏదైనా మాట్లాడితే దేశద్రోహులని అంటున్నారు” అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు మల్లికార్జున ఖర్గే.
అలాగే చైనాతో సరిహద్దు ఘర్షణల అంశంపై పార్లమెంటులో చర్చించేందుకు అనుమతించడం లేదని అధికార బీజేపీని విమర్శించారు. “వారు (బీజేపీ ప్రభుత్వం) బయటికేమో సింహంలా మాట్లాడతారు. అయితే వారి చర్యలు చూస్తే ఎలుకలా అనిపిస్తాయి” అని ఖర్గే అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఖర్గే క్షమాపణలు చెప్పాల్సిందే..
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కామెంట్లపై పార్లమెంట్లో మంగళవారం గొడవ జరిగింది. ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. “మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన వాడిన అభ్యంతకరమైన పదజాలం, అబద్ధాలు ప్రచారం చేసేందుకు పూనుకున్న ప్రయత్నాన్ని ఖండిస్తున్నాం. అల్వార్ సభలో చేసిన కామెంట్లపై ఆయన క్షమాపణ చెప్పాల్సిందే” అని కేంద్ర మంత్రి పియూష్ గోయల్.. రాజ్యసభలో అన్నారు.
అయితే, తాను అల్వార్ సభలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే అన్నారు. దీంతో దుమారం మరింత ఎక్కువైంది. ఎంపీలు వాగ్వాదానికి దిగటంతో గందరగోళం నెలకొంది.
మనం పిల్లలం కాదు
సభలో గందరగోళం ఏర్పడటంతో రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ (Jagdeep Dhankar) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మనం పిల్లలం కాదంటూ ఎంపీలకు గుర్తు చేశారు. ఇలాంటి ప్రవర్తనతో చెడ్డ పేరు వస్తుందని అన్నారు. “మనం చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాం. 135 కోట్ల మంది ప్రజలు మనల్ని చూసి నవ్వుకుంటున్నారు. మనం ఏ స్థాయికి దిగజారామో చూసి ఆశ్చర్యపోతున్నారు, ఆలోచిస్తున్నారు” అని సభాపతి జగ్దీప్.. ఎంపీలతో అన్నారు.