Train Thieves: వీళ్లు బిహార్ దొంగలు.. ఏకంగా రైలు ఇంజిన్ నే కొట్టేశారు
Train Thieves: బిహార్ పోలీసులకు నిద్ర పట్టనివ్వడం లేదు ఈ ఖతర్నాక్ దొంగలు. ఇళ్లను, మనుషులను దోచుకోవడం బోరు కొట్టిందేమో, ఏకంగా రైలు ఇంజిన్లనే దొంగతనం చేయడం ప్రారంభించారు.
Train Thieves: బిహార్ లో కొత్త రకం దోపిడీ దొంగలు తెరపైకి వచ్చారు. రైలు ఇంజిన్లను, రైలు పట్టాలను, బ్రిడ్జిలపై ఐరన్ ను ఎత్తుకెళ్లి, స్క్రాప్ కింద అమ్మేసే ముఠా గురించి బిహార్ పోలీసులు తాజాగా వెల్లడించారు.
ట్రెండింగ్ వార్తలు
Train Thieves: మొత్తం రైలు ఇంజిన్ నే లేపేశారు
గత వారం మరమ్మత్తుల కోసం బరౌనీలోని గర్హర రైల్వే సర్వీస్ కేంద్రానికి వచ్చిన డీజిల్ ఇంజిన్ మొత్తాన్ని పూర్తిగా ఎత్తుకెళ్లిపోయారు. ముందు, పార్ట్ లు, పార్ట్ లుగా విడదీసి, ఆ తరువాత ఒక్కటొక్కటిగా వాటిని దొంగతనం చేశారని పోలీసులు వెల్లడించారు. వేరే కేసులో అరెస్టైన ముగ్గురిని విచారిస్తున్న సమయంలో ఈ దొంగతనం విషయం తెలిసిందని తెలిపారు. వారిచ్చిన సమాచారంతో ముజఫర్ నగర్ లోని ప్రభాత్ కాలనీ లో ఉన్న స్క్రాప్ గోడౌన్ నుంచి ఇంజిన్ భాగాలున్న 13 గోనె సంచులను స్వాధీనం చేసుకున్నమని వెల్లడించారు.
Train Thieves: ఏకంగా సొరంగమే తొవ్వారు..
రైలు మరమ్మతుల కేంద్రంలోకి వెళ్లడానికి దొంగలు ఏకంగా ఒక చిన్న సొరంగాన్నే తొవ్వడం విశేషం. ప్రతీ రోజు రాత్రి ఆ సొరంగం ద్వారా ఇంజిన్ విడి భాగాలను ఎత్తుకెళ్లేవారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులెవరూ గుర్తించకపోవడం విశేషం.
Train Thieves: వింటేజ్ ఇంజిన్ ను కూడా..
పుర్నియా జిల్లాలో ఒక వింటేజ్ స్టీమ్ ఇంజిన్ ను కూడా దొంగలు ఎత్తుకు వెళ్లారు. ప్రజలు చూడడం కోసం స్థానిక రైల్వే స్టేషన్ ముందు డిస్ ప్లే గా పెట్టిన వింటేజ్ స్టీమ్ ఇంజిన్ ను దొంగలు ఎత్తుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అయితే, అది బయటి దొంగల పని కాదని, రైల్వేలోని ఇంటి దొంగల పనేనని తరువాత విచారణలో తేలింది. రైల్వేలో స్థానికంగా పని చేస్తున్న ఒక ఇంజినీర్ డివిజనల్ మెకానికల్ ఇంజినీర్ నుంచి అనుమతి పొందినట్లు ఒక నకిలీ లేఖను సృష్టించి ఈ పురాతన ఇంజిన్ ను అమ్మేశాడు.
Train Thieves: మరో గ్యాంగ్..
ఇవన్నీ ఇలా ఉండగా, మరో గ్యాంగ్ ఏకంగా, ఒక ఐరన్ బ్రిడ్జ్ నే కొట్టేసే ప్రయత్నం చేశారు. ఆరారియా జిల్లాలో సీతాధర్ నది పై ఉన్న ఐరన్ బ్రిడ్జి కి సంబంధించిన కొన్ని బోల్టులను విప్పి పెట్టారు. కొంత ఐరన్ సామానును ఎత్తుకెళ్లిపోయారు. సమాచారం అందడంతో దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆ బ్రిడ్జ్ ను ఎవరు దొంగలించకుండా అక్కడ ఒక కానిస్టేబుల్ ను పెట్టారు. ఇదే సంవత్సరం ఏప్రిల్ లో 45 ఏళ్ల నాటి ఒక ఐరన్ బ్రిడ్జిన్ పట్టపగలు దర్జాగా విప్పదీసి, తీసుకువెళ్లి అమ్మేశారు. అయితే, ఆ తరువాత వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒక ప్రభుత్వ ఇంజినీర్ కూడా ఉండడం గమనార్హం.