Nitin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు ఇక ఉచిత చికిత్స: నితిన్ గడ్కరీ-road accident victims in india start to get cashless treatment nitin gadkari ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nitin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు ఇక ఉచిత చికిత్స: నితిన్ గడ్కరీ

Nitin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు ఇక ఉచిత చికిత్స: నితిన్ గడ్కరీ

HT Telugu Desk HT Telugu

Nitin Gadkari: భారతదేశంలో రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకాన్ని రెండు చోట్ల ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంటులో తెలిపారు. ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఈ చికిత్స అందిస్తామన్నారు.

రోడ్డు ప్రమాద మరణాల్లో భారత్ దే అగ్రస్థానం (PTI)

భారత్ లో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కేంద్రం అందించే నగదు రహిత చికిత్స త్వరలోనే అందుబాటులోకి రానుంది. రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు చండీగఢ్, అసోంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. త్వరలో దీనిని దేశవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. అంతేకాకుండా, అన్ని రకాల రహదారులపై జరిగే ప్రమాదాలకు ఈ పథకాన్ని వర్తించేలా చూస్తామన్నారు

ఎన్హెచ్ఏఐ సహకారంతో..

నేషనల్ హెల్త్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సహకారంతో భారతదేశంలో రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స (cashless treatment) ప్రాజెక్టును కేంద్రం చేపట్టింది. ఈ ప్రాజెక్టును ఈ ఏడాది మార్చిలోనే ప్రకటించారు. ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి ప్రాణాలను కాపాడేందుకు ఇది దోహదపడుతుంది. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. దేశంలో 2022లో రోడ్డు ప్రమాదాల్లో 1.68 లక్షల మంది చనిపోయారు.

పార్లమెంటులో ప్రకటన

రాజ్యసభకు గురువారం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో నితిన్ గడ్కరీక ఈ విషయాన్ని వెల్లడించారు. "రోడ్డు ప్రమాద బాధితులకు ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి-జన్ ఆరోగ్య యోజన కింద ఎంప్యానెల్ చేసిన ఆసుపత్రులలో ట్రామా మరియు పాలిట్రామా సంరక్షణకు సంబంధించిన ఆరోగ్య ప్రయోజనాల ప్యాకేజీలను, ప్రమాదం జరిగిన తేదీ నుండి గరిష్టంగా 7 రోజుల కాలానికి గరిష్టంగా రూ .1.5 లక్షల వరకు అందిస్తారు. భారతదేశంలో రోడ్డు ప్రమాదాలకు గురైన బాధితులు ప్రమాదం జరిగిన వెంటనే సరైన చికిత్స అందకపోవడం వల్ల మరణిస్తారు. దీనిని గోల్డెన్ అవర్ అని కూడా పిలుస్తారు. ఆ సమయంలో వెంటనే చికిత్స అందితే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తలెత్తదు’’ అని గడ్కరీ వివరించారు.

మోటారు వాహన ప్రమాద నిధి నుంచి డబ్బులు..

నగదు రహిత చికిత్సకు అయ్యే ఖర్చును మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 164 బి కింద మోటారు వాహన ప్రమాద నిధి అందిస్తుంది. ఈ పథకాన్ని భారతదేశం అంతటా అమలు చేయడానికి ఎన్హెచ్ఏఐ బాధ్యత వహిస్తుంది. ఇది స్థానిక పోలీసులు, ఆసుపత్రులు, ఆరోగ్య సంస్థలు, జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తో సహా వివిధ భాగస్వాములను సమన్వయం చేస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఎన్హెచ్ఏ (NHAI) డిజిటల్ ప్లాట్ఫామ్ ను ఉపయోగిస్తుంది.

భారత్ దే టాప్ ర్యాంక్

2022 లో, భారతదేశంలో 4.61 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు (Road accident) జరిగాయి, వీటిలో 1.68 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 4.43 లక్షల మంది గాయపడ్డారు. 2030 నాటికి రోడ్డు ప్రమాదాల సంఖ్యను సగానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రం ఇటీవల తెలిపింది.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.