Republic Day Parade : కర్తవ్య పథ్లో అట్టహాసంగా రిపబ్లిక్ డే పరేడ్..
Republic Day Parade : దిల్లీ కర్తవ్య పథ్లో రిపబ్లిక్ డే పరేడ్ ఘనంగా సాగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఇతరులు ఈ పరేడ్లో పాల్గొన్నారు.
76వ గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో దిల్లీ కర్తవ్య పథ్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అనంతరం సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకలను వీక్షించేందుకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటో, భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సహా అనేక మంది కేంద్రమంత్రులు, నేతలు కర్తవ్య పథ్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ఏడాది.. "స్వర్ణిమ్ భారత్- విరాసత్ ఔర్ వికసిత్' అనే థీమ్తో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకుని మొత్తం మీద ఈసారి 31 శకటాలను ప్రదర్శనకు వచ్చాయి. అంతేకాదు, త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం ఈసారి పరేడ్లో ప్రత్యేకమని చెబుతున్నారు. వీటితో పాటు బ్రహ్మోస్- ఆకాశ్ మిసైళ్లు, ఇతర రాకెట్ల ప్రదర్శన సైనిక శక్తిని ప్రతిబింబించాయి.
కట్టుదిట్ట భద్రత మధ్య..
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీ భద్రతా వలయంలోకి జారుకుంది. కర్తవ్య పథ్ మార్గంలో ఆంక్షలు విధించారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి పరేడ్ ముగిసే వరకు కార్తవ్య మార్గాన్ని అన్ని వాహనాల రాకపోకలకు మూసివేశారు. దేశ రాజధానిలోకి ప్రవేశాన్ని పరిమితం చేశారు. నిత్యావసర వాహనాలను మాత్రమే అనుమతించారు. రిపబ్లిక్ డే పరేడ్ ముగిసే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
జాతీయ యుద్ధస్మారకంలో నివాళులు..
అంతకుముందు, రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ యుద్ధస్మారకం వద్దకు వెళ్లిన ప్రధాని మోదీ, అమరవీరులను స్మరించుకుని, 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.
76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు మోదీ.. కాషాయ, ఎరుపు రంగు సఫా, గోధుమ రంగు బంద్గాలా కోటు, క్రీమ్ కలర్ చుడీదార్ కుర్తా సెట్ ధరించారు.
దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు..
అటు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. వివిధ రాష్ట్రా ముఖ్యమంత్రులు, గవర్నర్లు.. జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు కేంద్రమంత్రులు సైతం తమతమ కార్యాలయాల్లో జెండా వందనం చేసి సెల్యూట్ చేశారు.
సంబంధిత కథనం