100 km road constructed in 100 hours:యూపీలోని ఘాజియాబాద్, అలీగఢ్ ఎక్స్ ప్రెస్ వే (Ghaziabad-Aligarh Expressway) పై కేవలం 100 గంటల్లో 100 కిమీల రోడ్డును నిర్మించారు. బిట్యూమినస్ కాంక్రీట్ (bituminous concrete) తో ఈ రోడ్డును నిర్మించారని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఘాజియాబాద్, అలీగఢ్ ఎక్స్ ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్, క్యూబ్ హైవేస్ ట్రస్ట్, లార్సన్ అండ్ టుబ్రో సంయుక్తంగా ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేశాయి. ఎన్ హెచ్ 34 (NH34) పై ఉన్న ఘాజియాబాద్, అలీగఢ్ ఎక్స్ ప్రెస్ వే (Ghaziabad-Aligarh Expressway) వ్యావసాయిక ప్రాంతాలను, జనావాస ప్రాంతాలను, పారిశ్రామిక ప్రాంతాలను, విద్యాసంస్థలు ఉన్న ప్రాంతాలను అనుసంధానించే కీలక రహదారి అని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) తెలిపారు. దేశంలోని కీలక వాణిజ్య మార్గంగా ఇది అభివృద్ధి చెందనుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో చవకైన, మన్నికైన కోల్డ్ సెంట్రల్ ప్లాంట్ రీ సైక్లింగ్ (CCPR) అనే గ్రీన్ టెక్నాలజీని ఉయయోగించామన్నారు. వాతావరణ కాలుష్యానికి కారణం కాకుండా, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.