జీడీపీ వృద్ధి అంచనాల్లో కోత.. 7.2 శాతానికి తగ్గింపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23కి వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాను 7.2 శాతానికి తగ్గించింది. మునుపటి అంచనా 7.8 శాతంగా ఉంది.
2022-23 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనా కూడా 4.5 శాతం నుంచి 5.7 శాతానికి పెరిగింది.
ట్రెండింగ్ వార్తలు
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తన ద్రవ్య విధాన ప్రకటనలో ‘2022-23 సంవత్సరానికి వాస్తవిక జీడీపీ వృద్ధి ఇప్పుడు 7.2 శాతంగా అంచనా వేశాం. 2022-23 మొదటి త్రైమాసికంలో 16.2 శాతం, రెండో త్రైమాసికంలో 6.2 శాతంగా, మూడో త్రైమాసికంలో 4.1 శాతంగా, చివరి క్వార్టర్లో 4 శాతంగా ఉంటుందని అంచనా వేశాం..’ అని వివరించారు.
2022-23లో 5.7 శాతంగా అంచనా వేసిన ద్రవ్యోల్బణం క్యూ1లో సగటున 6.3 శాతం, క్యూ 2లో 5 శాతం, క్యూ 3లో 5.4 శాతం, క్యూ 4లో 5.1 శాతంగా ఉంది.
‘ఫిబ్రవరి చివరి నుంచి అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలలో అధిక అస్థిరత, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల తీవ్ర అనిశ్చితి కారణంగా వృద్ధి, ద్రవ్యోల్బణం అంచనాలు రిస్క్తో కూడుకుని ఉంటాయి. భవిష్యత్తులో చమురు, ద్రవ్యోల్భణంపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి..’ అని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు.
2020-23 సంవత్సరంలో ముడి చమురు బ్యారెల్కు 100 డాలర్ల చొప్పున ఉంటుందని అంచనా వేస్తూ ఆమేరకు వృద్ధి అంచనాలను సవరించారు.
ఫిబ్రవరి 28న నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ విడుదల చేసిన రెండో అడ్వాన్స్ అంచనాల ప్రకారం 2021-22లో వాస్తవ జీడీపీ 8.9 శాతంగా ఉంది.
‘ప్రైవేట్ వినియోగం, స్థిర పెట్టుబడి కోవిడ్ మహమ్మారి కంటే ముందున్న స్థాయిల కంటే తక్కువగా ఉన్నాయి’ అని దాస్ చెప్పారు.