Rajasthan political crisis: ఢిల్లీకి అశోక్ గహ్లోత్; ఢిల్లీలోనే సచిన్ పైలట్-rajasthan political crisis ashok gehlot to visit delhi meet sonia gandhi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Rajasthan Political Crisis: Ashok Gehlot To Visit Delhi, Meet Sonia Gandhi

Rajasthan political crisis: ఢిల్లీకి అశోక్ గహ్లోత్; ఢిల్లీలోనే సచిన్ పైలట్

HT Telugu Desk HT Telugu
Sep 28, 2022 03:44 PM IST

Rajasthan political crisis: రాజస్తాన్ లోని అధికార కాంగ్రెస్ లో సంక్షోభం ముదురుతోంది. ప్రస్తుతం రాజస్తాన్ రాజకీయం ఢిల్లీకి చేరింది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ బుధవారం జైపూర్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఉపముఖ్యమంత్రి, గహ్లోత్ ప్రత్యర్థి సచిన్ పైలట్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు.

అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్
అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్

Rajasthan political crisis: రాజస్తాన్ లో అధికార కాంగ్రెస్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరింది. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించిన ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అనుయాయులపై పార్టీ సీరియస్ గా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Rajasthan political crisis: ఢిల్లీకి సీఎం, డెప్యూటీ సీఎం

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన బుధవారం సాయంత్రం పార్టీ చీఫ్ సోనియా గాంధీతో సమావేశం కానున్నారు. కాగా, రాజస్తాన్ ఉప ముఖ్యమంత్రి, అశోక్ గహ్లోత్ ప్రత్యర్థి సచిన్ పైలట్ కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు.

Rajasthan political crisis: గహ్లోత్ మద్దతుదారులపై సీరియస్

రాజస్తాన్ కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభాన్ని తొలగించే ఉద్దేశంతో జైపూర్ కు వచ్చిన పార్టీ పరిశీలకులు అజయ్ మాకెన్, మల్లిఖార్జున్ ఖర్గేలను గహ్లోత్ మద్దతుదారులైన ఎమ్మెల్యేలు పట్టించుకోలేవు. వారు వేరేగా మరో సమావేశం పెట్టుకున్నారు. దాంతో, ఒక్కో ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా సమావేశమై, వారి అభిప్రాయం తెలుసుకోవాలన్న మాకెన్, ఖర్గేల ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో, వారు ఢిల్లీ తిరిగివెళ్లారు. మరోవైపు, మంగళవారం తనకు సన్నిహితులైన పలువురు మంత్రులు, సీనియర్ నాయకులతో సీఎం గహ్లోత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తాను రాజీనామా చేస్తే, తదుపరి సీఎంగా ఎవరు ఉండాలనే విషయంలో వారు చర్చించినట్లు సమాచారం.

Rajasthan political crisis: షోకాజ్ నోటీసులు

మరోవైపు, పార్టీ ధిక్కార చర్యలకు పాల్పడిన ముగ్గురు అశోక్ గహ్లోత్ అనుయాయులకు పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. రాజస్తాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మేంద్ర రాథోడ్, పార్టీ చీఫ్ విప్ మహేశ్ జోషి, శాసన సభ వ్యవహారాల మంత్రి శాంతి ధరీవాల్ లకు అధిష్టానం షోకాజ్ నోటీసులను జారీ చేసింది.

Rajasthan political crisis: పైలట్ కాకూడదు..

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అశోక్ గహ్లోత్ ఎన్నికైతే.. ఒక వ్యక్తికి ఒకే పదవి విధానం ప్రకారం.. ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది. దాంతో, ఆయన వారసుడెవరెనే విషయంపై ప్రస్తుతం వివాదం నెలకొంది. ప్రధాన పోటీ దారుగా ఉన్న సచిన్ పైలట్ ముఖ్యమంత్రి కావడాన్ని గహ్లోత్ మద్దతుదారులైన ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. వారు మూకుమ్మడిగా తమ రాజీనామా పత్రాలను గవర్నర్ కు ఇప్పటికే అందించారు. ఈ నేపథ్యంలో అధిష్టానం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

WhatsApp channel