రాజస్తాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ కు పట్టరాని కోపమొచ్చింది. చేతిలోని మైక్రోఫోన్ ను పక్కన నిల్చుని ఉన్న జిల్లా కలెక్టర్ వైపు విసిరి కొట్టాడు. సీఎం గహ్లోత్ చర్యతో అక్కడున్న వాళ్లంతా అవాక్కయ్యారు. ఈ ఘటన శుక్రవారం రాజస్తాన్ లోని బార్మర్ జిల్లాలో జరిగింది.
రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఒక అధికారిక కార్యక్రమం కోసం బార్మర్ కు వెళ్లారు. అక్కడ సర్క్యూట్ హౌజ్ లో బస చేశారు. సీఎం పాల్గొనాల్సిన ఒక కార్యక్రమం అక్కడి స్థానిక మహిళలతో మాట ముచ్చట జరపడం. ప్రభుత్వ పథకాలపై వారి స్పందన తెలుసుకోవడం. ఈ కార్యక్రమం కోసం అధికారులు స్థానికంగా ఉన్న కొందరు మహిళలను సీఎం బస చేస్తున్న భవనానికి తీసుకువచ్చారు. వారిని ఉద్దేశించి సీఎం గహ్లోత్ మాట్లాడాల్సి ఉండగా.. అదే సమయానికి మైక్రోఫోన్ పనిచేయడం మానేసింది. సీఎం గహ్లోత్ మాట్లాడడానికి ప్రయత్నించడం, మైక్రోఫోన్ మొరాయించడం.. ఇలా రెండు మూడు సార్లు జరిగింది. దాంతో ముఖ్యమంత్రికి పట్టరాని కోపం వచ్చింది. సీఎం కార్యక్రమానికి కనీసం సరైన మైక్రోఫోన్ ను కూడా అమర్చలేరా? అన్న కోపంతో మైక్రో ఫోన్ ను పక్కన నిల్చుని ఉన్న బార్మర్ జిల్లా కలెక్టర్ వైపు విసిరేశాడు. పాపం.. కలెక్టర్ ఆ మైక్ ను తీసుకుని తన దగ్గర పెట్టుకున్నాడు. ఈ లోపు అధికారుల హుటాహుటిన మరో మైక్రోఫోన్ ను ఏర్పాటు చేయడంతో, కాస్త శాంతించి, కార్యక్రమం కొనసాగించాడు. అంతకుముందు కూడా, అక్కడికి వచ్చిన మహిళల వెనుక కొందరు పురుషులు నిల్చుని ఉండడాన్ని చూసిన సీఎం ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారిని పంపించేయాలని ఆదేశించాడు. ‘ఎక్కడయ్యా ఎస్పీ?.. కలెక్టర్, ఎస్పీ ఒక్కలాగే ఉన్నారే..’ అంటూ అరిచేశాడు.
ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారడంతో, సీఎం మైక్ విసిరేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజస్తాన్ సీఎం ఆఫీస్ ఒక వివరణను ఇచ్చింది. మైక్ ను సీఎం గహ్లోత్ కలెక్టర్ వైపు విసిరేయలేదని, ఆ సమయంలో సీఎం కు కోపం కూడా రాలేదని వివరించింది.