భర్తను చంపేసమయంలో అక్కడే సోనమ్.. హత్య తర్వాత ప్రియుడి గదికి..-raja raghuwanshi murder case key details out sonam raghuwanshi meet her lover after husband murder ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  భర్తను చంపేసమయంలో అక్కడే సోనమ్.. హత్య తర్వాత ప్రియుడి గదికి..

భర్తను చంపేసమయంలో అక్కడే సోనమ్.. హత్య తర్వాత ప్రియుడి గదికి..

Anand Sai HT Telugu

మేఘాలయ హనీమూన్ హత్యకేసులో ఒక్కొక్కటిగా కీలక విషయాలు బయటకు వస్తు్న్నాయి. సోనమ్, ఆమె ప్రేమికుడు రాజ్ మధ్య రహస్య చాట్ వెలుగులోకి వచ్చింది. అంతేకాదు భర్త రాజా రఘువంశీని చంపించిన తర్వాత భార్య సోనమ్ ఇండోర్ వచ్చి.. ప్రియుడిని కలిసింది.

సోనమ్

హనీమూన్ హత్య మిస్టరీ వీడింది, ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ ముందు జరిగిన విచారణలో నిందితులు రాజా రఘువంశీని చంపి తరువాత అతని మృతదేహాన్ని లోయలో పడేసినట్లు అంగీకరించారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రాజా హత్యకు గురయ్యే సమయంలో సోనమ్ అక్కడే ఉందని విచారణలో స్పష్టమైంది. భర్తను చంపేటప్పుడు ఆమె అక్కడే ఉంది. ఈ మొత్తం కేసులో సోనమ్ రఘువంశీని ప్రధాన నిందితురాలిగా, కుట్రదారుడిగా పేర్కొన్నారు పోలీసులు.

ఇండోర్ నుంచి ప్రియుడు

విచారణ సమయంలో రాజాపై మొదట దాడి చేసింది విశాల్ అలియాస్ విక్కీ ఠాకూర్ అని క్రైమ్ బ్రాంచ్‌కు తెలిసింది. ఆకాష్, ఆనంద్ కూడా రాజాపై దాడి చేసి, అతని మృతదేహాన్ని ఒక లోయలో పడేశారు. ఈ మొత్తం కుట్రలో సోనమ్‌కు ఇండోర్‌ నుంచి అన్ని సమయాలలో ప్రియుడు రాజ్ కుష్వాహా మద్దతు ఇచ్చాడు. మేఘాలయకు వెళ్లడానికి విశాల్, ఆకాష్, ఆనంద్‌లకు రూ.50 వేల వరకు ఇచ్చాడు.

వాట్సాప్ చాట్

మరోవైపు సోనమ్, ఆమె ప్రేమికుడు రాజ్ కుష్వాహా వాట్సాప్ చాట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనేక షాకింగ్ విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. రాజ్ కుష్వాహాకు హవాలా వ్యాపారంతో కూడా సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. రాజ్ ఫోన్‌లో కోట్ల విలువైన హవాలా వ్యాపారానికి సంబంధించిన ఆధారాలను పోలీసులు కనుగొన్నారు. ఈ హత్యలో తనను ఎవరూ అనుమానించకూడదని రాజ్ కోరుకున్నాడు. దీని కోసం అతను స్వయంగా ఇండోర్‌లోనే ఉండి హంతకులను నిరంతరం సంప్రదిస్తూ ఉండేవాడు.

ప్లాన్ బి కూడా

సోనమ్ తన భర్త రాజా రఘువంశీని చంపడానికి ప్లాన్ బి కూడా సిద్ధం చేసిందని చెబుతున్నారు. ఆమె రాజాను సజీవంగా చూడాలనుకోలేదు. హంతకులు రాజాను చంపలేకపోతే, సెల్ఫీ తీసుకునే నెపంతో సోనమ్ అతన్ని లోయలోకి తోసి చంపాలనుకుంది.

హత్య తర్వాత ప్రియుడి దగ్గరకు సోనమ్

హత్య తర్వాత మే 23 నుంచి ఈ జంట కనిపించని విషయం వైరల్‌గా మారింది. ఆ తర్వాత సోనమ్ ఉత్తరప్రదేశ్‌లో ప్రత్యక్షమైంది. తనను ఎవరో కిడ్నాప్ చేసి గాజీపూర్‌లో వదిలిపెట్టారని నాటకం ఆడింది. అయితే భర్తను హత్య చేయించిన తర్వాత సోనమ్ రైలులో ఇండోర్‌కు వచ్చింది. తన ప్రియుడు రాజ్ కుష్వాహాను ఓ గదిలో కలుసుకుంది. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయేందుకు ప్లాన్ చేశారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.