మహారాష్ట్రలో అలజడులు తప్పవా? 'డెడ్లైన్' తర్వాత ఏం జరుగుతుంది?
తాను ఇచ్చిన డెడ్లైన్లోపు మసీదుల్లో లౌడ్స్పీకర్లను తొలగించాలని ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే హెచ్చరించారు. లేకపోతే.. ఆ తర్వాత జరిగే పరిణామాలకు తాను బాధ్యుడిని కాదని తేల్చిచెప్పారు.
Raj Thackeray loudspeaker | మహారాష్ట్రలో లౌడ్స్పీకర్ వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది. మసీదుల్లో లౌడ్స్పీకర్ల తొలగింపునకు ఈ నెల 3వ తేదీ డెడ్లైన్ అని ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే పునరుద్ఘాటించారు. అప్పటిలోగా రాష్ట్రంలోని మసీదుల్లో లౌడ్స్పీకర్లు తొలగించాలని.. లేకపోతే ఆ తర్వాత ఏం జరిగినా తాను బాధ్యుడిని కానని తేల్చిచెప్పారు.
ట్రెండింగ్ వార్తలు
ఔరంగాబాద్లో ఆదివారం సాయంత్రం బహిరంగ సభ నిర్వహించారు రాజ్ ఠాక్రే. ఈ సభకు వేలాది మంది తరలివెళ్లారు. ఈ క్రమంలోనే డెడ్లైన్ గురించి రాజ్ ఠాక్రే మాట్లాడారు.
"మసీదుల్లో లౌడ్స్పీకర్ అనేది మతపరమైన వ్యవహారం కాదు. ఇదొక సామాజిక సమస్య. లౌడ్స్పీకర్లు చట్టానికి విరుద్ధం. ఈ విషయం సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. మసీదుల్లో లౌడ్స్పీకర్లతో ముస్లింలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఓ జర్నలిస్టు నా దగ్గరకి వచ్చి ఈ విషయాన్ని చెప్పాడు. తాను ముస్లిం అని, కానీ మసీదుల్లో లౌడ్స్పీకర్ వల్ల తన పిల్లలు పడుకోవడం లేదని, చాలా ఇబ్బందిగా ఉందని అన్నాడు. నేడు.. మహారాష్ట్ర దినోత్సవంలో తొలిరోజు. నాలుగో రోజు నుంచి నేను ఎవరి మాట వినను. 3వ తేదీన ఈద్ పండుగ ఉంది. ముస్లింలను నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కానీ లౌడ్స్పీకర్లను తొలగించాల్సిందే. పోలీసులు ఆ పని చేయాలి. లేకపోతే మేము స్పందించాల్సి ఉంటుంది. మేము మసీదుల వద్దకు వెళతాము. మసీదుల ఎదుట రెండింతల శక్తితో హనుమాన్ చాలీసా పెడతాము. ముస్లింలు అందరు మా హనుమన్ చాలీసా వినాలి," అని రాజ్ ఠాక్రే తేల్చిచెప్పారు.
Loudspeaker controversy | రాష్ట్రంలో అలజడులు, ఘర్షణలు సృష్టించడం తన ఉద్దేశం కాదని, కానీ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజ్ ఠాక్రే ఆరోపించారు.
ఈ క్రమంలోనే తన బంధువు, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై రాజ్ ఠాక్రే మండిపడ్డారు. ఉత్తర్ప్రదేశ్లో లౌడ్స్పీకర్లను తొలగించారని గుర్తుచేశారు. అలాంటిది.. మహారాష్ట్రంలో లౌడ్స్పీకర్లను తొలగించేందుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు.
సంబంధిత కథనం