IMD rain alert : ఐపీఎల్​-18 తొలి మ్యాచ్​ జరగడం కష్టమేనా? ఈ రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన..-rain alert imd predicts rainfall in these states till march 22 details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Imd Rain Alert : ఐపీఎల్​-18 తొలి మ్యాచ్​ జరగడం కష్టమేనా? ఈ రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన..

IMD rain alert : ఐపీఎల్​-18 తొలి మ్యాచ్​ జరగడం కష్టమేనా? ఈ రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన..

Sharath Chitturi HT Telugu

IMD rain alert : రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. 22న, ఐపీఎల్​-18 ప్రారంభమయ్యే సమయంలో పశ్చిమ్​ బెంగాల్​లో వర్షాలు పడతాయని ఐఎండీ చెప్పడం క్రికెట్​ ఫ్యాన్స్​ని ఆందోళనకు గురిచేస్తోంది.

కోల్​కతాలో వర్షాలకు ఓ వ్యక్తి ఇలా.. (Hindustan Times)

మార్చ్​ నెలలో ఓవైపు ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుంటే, మరోవైపు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మాత్రం అనేక రాష్ట్రాలకు చల్లటి వార్తను అందించింది. వచ్చే వారం వరకు అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది. నైరుతి మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇందుకు ఒక కారణం అని పేర్కొంది.

ఐఎండీ వర్ష సూచన..

పశ్చిమ్​ బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈ నెల 20న మొదలైన వర్షాలు 22వ తేదీ వరకు కొనసాగుతాయని ఐఎండీ వెల్లడించింది. అనేక చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

మార్చ్​ 21న పశ్చిమ మధ్యప్రదేశ్​లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, 22 వరకు తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్​గఢ్​లో వర్షాలు కురుస్తాయని, ఆ తర్వాత పరిస్థితులు చక్కబడతాయని ఐఎండీ తెలిపింది.

మార్చ్​ 20-22 మధ్య ఉత్తర్​ప్రదేశ్​లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి, మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

మార్చ్​ 20 నుంచి 22 వరకు ఉప హిమాలయ రాష్ట్రాలైన పశ్చిమ్​ బెంగాల్, సిక్కిం, బిహార్​లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

శనివారం ఐపీఎల్​18 ప్రారంభంకానున్న నేపథ్యంలో పశ్చిమ్​ బెంగాల్​లో వర్ష సూచన.. క్రికెట్​ లవర్స్​ని ఆందోళనకు గురిచేస్తోంది.

ఈశాన్య రాష్ట్రాలు..

ఈశాన్య అసోం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో మార్చ్​ 20 నుంచి 23 వరకు అరుణాచల్​ప్రదేశ్​లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మార్చ్​ 21, 22 తేదీల్లో అక్కడక్కడా భారీ వర్షాలు లేదా హిమపాతం కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

రానున్న 5 రోజుల్లో అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో (గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో) తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మార్చ్​ 21న దక్షిణ అసోంలో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

దక్షణాది రాష్ట్రాల్లో ఇలా..

22 నుంచి 24 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కోస్తా కర్ణాటక, ఉత్తర అంతర్గత కర్ణాటక, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో (గంటకు 30-50 కి.మీ) చెదురుమదురు తేలికపాటి/ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

రానున్న 5 రోజుల పాటు కేరళ, మాహే, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మార్చ్​ 21, 22 తేదీల్లో తెలంగాణలో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉంది.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.