senior citizen travellers : రైళ్లలో సీనియర్ సిటిజన్ల ప్రయాణాలు తగ్గిపోయాయి….-railways sees dip in senior citizen travellers in 2021 22 pandemic key reason officials ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Railways Sees Dip In Senior Citizen Travellers In 2021-22, Pandemic Key Reason: Officials

senior citizen travellers : రైళ్లలో సీనియర్ సిటిజన్ల ప్రయాణాలు తగ్గిపోయాయి….

HT Telugu Desk HT Telugu
Nov 28, 2022 06:10 AM IST

senior citizen travellers రైళ్లలో ప్రయాణించే సీనియర్ వయో వృద్ధుల ప్రయాణాలు గణనీయంగా తగ్గిపోయాయి. 2020లో కోవిడ్ ప్రభావంతో మొదలైన తగ్గుదల ఆ తర్వాత కూడా కొనసాగింది. రైళ్లలో వృద్ధులకు ఇచ్చే రాయితీలు రద్దు చేయడం కూడా దీనికి కారణంగా కనిపిస్తోంది. రెండేళ్ల గణంకాలను అంతకు ముందు ప్రయాణికులతో పోలిస్తే దాదాపు 24శాతం తగ్గుదల నమోదైంది.

రైళ్లలో తగ్గిన సీనియర్ సిటిజన్ల ప్రయాణాలు
రైళ్లలో తగ్గిన సీనియర్ సిటిజన్ల ప్రయాణాలు

senior citizen travellers దేశంలో రైళ్లలో వృద్ధుల ప్రయాణాలు గణనీయంగా తగ్గిపోయాయి. 2020 మార్చి నుంచి దేశ వ్యాప్తంగా రైలు ప్రయాణాలు ఆకస్మాత్తుగా నిలిచిపోవడంతో అతి పెద్ద ప్రజారవాణా వ్యవస్థ నెలల పాటు నిలిచిపోయింది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా ప్రజలు పడుతున్న అవస్థలతో రవాణా సదుపాయాలను పునరుద్ధరించినా ప్రయాణకుల సంఖ్య మాత్రం మునుపటి స్థాయికి చేరుకోలేదు. రెండున్నరేళ్లు దాటినా ఈ సంఖ్య ఇంకా సాధారణ స్థితికి చేరుకోకపోవడం ఆశ్చర్య పరుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థగా భారతీయ రైల్వేలు దేశ ప్రజలకు సేవలందిస్తున్నాయి. నిత్యం కోట్ల మంది పౌరులు కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణాల కోసం రైళ్లను ఆశ్రయిస్తుంటారు. ఇతర రవాణా వ్యవస్థలు ఉన్నా రైళ్లను మించిన రవాణా సదుపాయం దేశంలో మరొకటి లేదు.

ఇటీవల రైళ్లలో ప్రయాణించే వయోవృద్ధుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు వెల్లడైంది. 2019-2020తో పోలిస్తే 2021-2022లో వయోవృద్ధుల ప్రయాణికుల సంఖ్య సుమారు 24శాతం తగ్గినట్లు సమాచార హక్కు చట్టం కింద వెల్లడైంది. కొవిడ్‌ రెండో వేవ్‌ ఉద్ధృతి కొనసాగడం వల్ల చాలామంది రైలు ప్రయాణాలకు దూరంగా ఉండటం ఇందుకు కారణమై ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు వయోవృద్ధులకు ఇచ్చే రాయితీ ఎత్తివేయడం కూడా మరో కారణంగా అంచనా వేస్తున్నారు.

2018-19లో మొత్తం 7.1కోట్ల మంది వయో వృద్ధులు రైళ్లలో ప్రయాణిస్తే 2019-20 నాటికి ఈ సంఖ్య 7.2కోట్లకు పెరిగింది. అయితే, కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత 2020-21లో కేవలం 1.9కోట్ల మంది మాత్రమే రైళ్లలో ప్రయాణించారు. అదే 2021-22 వచ్చేసరికి ఈ సంఖ్య 5.5కోట్లకు పెరిగింది. అయితే సీనియర్ సిటిజన్‌ ప్రయాణికులు మాత్రం మునుపటితో పోలిస్తే తగ్గారు.

టిక్కెట్ల ద్వారా సమకూరిన ఆదాయాన్ని పరిశీలిస్తే వయోవృద్ధుల విభాగం నుంచి 2018-19లో రూ.2920 కోట్లు లభిస్తే 2019-20లో రూ.3010కోట్లకు చేరింది. 2020-21లో రూ.875కోట్లు, 2021-2022లోరూ.2598 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాదిలో సెప్టెంబర్‌ వరకు 3.8కోట్ల మంది వృద్ధులు రైళ్లలో ప్రయాణించారు. వారి నుంచి రూ.2335 కోట్ల ఆదాయాన్ని భారతీయ రైల్వే పొందింది. కరోనా మహమ్మారి సమయంలో విధించిన ఆంక్షలు రెండో వేవ్‌ చివరి వరకు కొనసాగడం రైల్వేపై ప్రభావాన్ని చూపింది. ఫలితంగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది.

మరోవైపు రైలు ప్రయాణాల్లో 58ఏళ్లు నిండిన మహిళలకు 50శాతం, 60ఏళ్లు నిండిన పురుషులకు 40శాతం రాయితీని భారతీయ రైల్వే అందించేది. అయితే, కరోనా కారణంగా మార్చి 2020 నుంచి వాటిని నిలిపివేసింది. ఇప్పటివరకు వాటిని తిరిగి పునరుద్ధరించలేదు. కేవలం కొన్ని రకాల రాయితీలను మాత్రమే రైల్వేలు పునరుద్ధరించాయి. రైళ్లలో రాయితీలను తొలగించడం కూడా ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడానికి కారణంగా కనిపిస్తోంది.

IPL_Entry_Point