NDTV Poll: పెరిగిన రాహుల్ గాంధీ పాపులారిటీ; అయినా.. మోదీదే హవా
NDTV Poll: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పాపులారిటీ పెరిగిందని, ముఖ్యంగా భారత్ జోడో యాత్ర తరువాత దేశ ప్రజల్లో రాహుల్ గాంధీ పట్ల సానుకూలత ఎక్కువగా వ్యక్తమవుతోందని తేలింది.
Rahul Gandhi's Popularity Grows: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పాపులారిటీ పెరిగిందని, ముఖ్యంగా భారత్ జోడో యాత్ర తరువాత దేశ ప్రజల్లో రాహుల్ గాంధీ పట్ల సానుకూలత ఎక్కువగా వ్యక్తమవుతోందని తేలింది. అయితే, ఇప్పటికీ దేశ ప్రజల్లో మోదీ పట్ల అభిమానం తగ్గలేదని ఎన్డీటీవీ సర్వేలో వెల్లడైంది. మే 10వ తేదీ నుంచి మే 19వ తేదీ వరకు లోక్ నీతి, సీఎస్డీఎస్ (Lokniti-Centre for the Study of Developing Societies CSDS) తో కలిసి ఎన్డీ టీవీ (NDTV) నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.
Rahul Gandhi's Popularity Grows: రాహుల్ గాంధీపై పెరుగుతున్న అభిమానం
నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తయ్యాయి. మరో ఏడాదిలో లోక్ సభ ఎన్నికలతో పాటు పలు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలను సేకరించే కార్యక్రమం లోక్ నీతి, సీఎస్డీఎస్ (Lokniti-Centre for the Study of Developing Societies CSDS) తో కలిసి ఎన్డీ టీవీ (NDTV) చేపట్టింది.
NDTV survey: ఈ సర్వే ప్రకారం..
దేశంలో మరోసారి మోదీ ప్రధాని కావాలని కోరుకునే వారిసంఖ్య 43% గా ఉంది. అలాగే, రాహుల్ గాంధీని ఎప్పుడూ అభిమానించే వారు 26% ఉండగా, మరో 15% మంది భారత్ జోడో యాత్ర తరువాత రాహుల్ ను అభిమానించడం ప్రారంభించామన్నారు. అంటే, మొత్తంగా రాహుల్ ను అభిమానించే వారి సంఖ్య 41% గా ఉంది. అలాగే, రాహుల్ గాంధీ అంటే ఇష్టం లేదని 16%, రాహుల్ గాంధీపై ఎటువంటి అభిప్రాయం లేదని 27% మంది తెలిపారు.
Modi dominates: మళ్లీ మోదీనే..
కర్నాటక ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. మోదీపై దేశ ప్రజల్లో అభిమానం తగ్గలేదు. మరో సారి మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలని 43% కోరుకున్నారు.38% మంది ఎన్డీయే ప్రభుత్వం మరోసారి గెలవకూడదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి ఓటేస్తామని సుమారు 40% ఓటర్లు, కాంగ్రెస్ కు ఓటేస్తామని 29% ప్రజలు తేల్చి చెప్పారు. అంటే బీజేపీ ఓట్ షేర్ 2019 లో 37% ఉండగా, 2023 నాటికి 40 శాతానికి పెరిగింది. మరోవైపు కాంగ్రెస్ ఓటు షేరు 2019లో 19% ఉండగా, 2023 నాటికి 29 శాతానికి పెరిగింది.
Who is the Best PM? ప్రధానిగా ఎవరు బెస్ట్
ఇప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధాని పదవికి నరేంద్రమోదీనే తమ ఎంపిక అని 43% మంది తేల్చిచెప్పగా, 27% రాహుల్ గాంధీ వైపు మొగ్గు చూపారు. పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లకు 4% చొప్పున ఓటేశారు. నితిశ్ కుమార్ (1%) కన్నా అఖిలేశ్ యాదవ్ (3%) వైపు ఎక్కువ శాతం మొగ్గు చూపడం విశేషం. కాగా, 2019 లో జరిపిన సర్వేలో ప్రధానిగా మోదీ కావాలని 44% మంది, రాహుల్ ప్రధాని కావాలని 24% మంది కోరుకున్నారు. ప్రధానిగా మోదీని ఎదుర్కొనే సత్తా ఎవరికుందన్న ప్రశ్నకు 34% రాహుల్ గాంధీ పేరు చెప్పారు. 11% కేజ్రీవాల్ ను, మమత బెనర్జీని 4%, అఖిలేశ్ యాదవ్ ను 5% ఎంపిక చేశారు. మోదీని ఎదుర్కొనే సత్తా ఎవరికీ లేదని 9% అభిప్రాయపడ్డారు. ఈ సర్వేలో దేశ వ్యాప్తంగా మొత్తం 71 నియోజకవర్గాల్లో 7202 మంది నుంచి అభిప్రాయాలను సేకరించారు.