అమిత్ షా ఇంట్లోకి ఆయనను బూట్లు విప్పి రమ్మన్నారు..: రాహుల్గాంధీ
కేంద్ర ప్రభుత్వంపై లోక్సభ సాక్షిగా విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఇది రాజ్యం కాదు.. మీరేమీ రాజు కాదు అంటూ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రంగా మండిపడ్డారు.
న్యూఢిల్లీ: ప్రస్తుతం రెండు ఇండియాలు ఉన్నాయని, ఒకటి గొప్పోళ్ల కోసం కాగా.. మరొకటి పేదోళ్లదని అన్నారు. ఈ రెండింటి మధ్య దూరం పెరుగుతూనే ఉన్నదని రాహుల్ అభిప్రాయపడ్డారు.
ట్రెండింగ్ వార్తలు
"మీరు ప్రతీసారి మేడిన్ ఇండియా గురించి మాట్లాడతారు. కానీ ఆ మేడిన్ ఇండియా సాధ్యం కాదు. ఎందుకంటే మీరు మేడిన్ ఇండియాను నాశనం చేశారు. మీరు చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించకపోతే మేడిన్ ఇండియా సాధ్యంకాదు. ఇదే ఉద్యోగాలను సృష్టిస్తాయి" అని రాహుల్ అన్నారు.
1947లోనే రాజ్యాలు పోయాయని, కానీ బీజేపీ మళ్లీ కింగ్ ఆఫ్ ఇండియా ఆలోచనను తీసుకొస్తోందని విమర్శించారు. సహకార సమాఖ్య వ్యవస్థలో సంప్రదింపులు, చర్చలే ఉండాలని, అలాకాకుండా మీరు భారత ప్రజలపై రాజ్యమేలలేరని రాహుల్ అన్నారు.
ఈ సందర్భంగా తన కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాల గురించి వివరించారు. "మా ముత్తాత 15 ఏళ్లు జైల్లో ఉన్నారు. మా నాన్నమ్మను 32సార్లు కాల్చారు. మా నాన్నను ముక్కలుగా పేల్చేశారు. అందుకే నేను ఏం మాట్లాడుతున్నానో నాకు తెలుసు. మీరు చాలా చాలా సమస్యలతో చెలగాటమాడుతున్నారు. వెంటనే ఆపండి. లేదంటే ఓ పెద్ద సమస్యను సృష్టించిన వాళ్లు అవుతారు. ఆ సమస్య ఇప్పటికే ప్రారంభమైంది" అని రాహుల్ అన్నారు.
చైనా, పాకిస్థాన్లను విభజించే వ్యూహం ఉండాలని, కానీ ప్రధాని మోదీ వాటిని ఏకం చేశారని విమర్శించారు. ఈ సందర్భంగా దేశంలో వ్యాపారవేత్తల పరిస్థితి ఎలా ఉందో కూడా వివరించే ప్రయత్నం చేశారు. ఓ వ్యాపారవేత్త అమిత్ షా ఇంటికి వెళ్లిన సమయంలో బూట్లు బయట విప్పి రమ్మన్నారని, అదే సమయంలో షా మాత్రం ఇంట్లో బూట్లతో తిరుగుతున్నారని రాహుల్ చెప్పారు. భారత ప్రజలను మీరు ఇలా చూడటం సరికాదని రాహుల్ అన్నారు.